ఆ మీడియా, ఈ మీడియా అనే తేడా లేకుండా తమకు ఎవరు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గానే దానిని తీసుకుంటోంది.ఎంతటి పెద్ద స్థాయి వ్యక్తులైనా, ఎంత వయసు పైబడిన వారైనా వదిలిపెట్టకుండా వారిపై కేసులు నమోదు చేస్తూ, కొద్ది రోజులుగా హడావుడి చేస్తోంది.
ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి మాత్రం తగ్గడం లేదు.స్వయంగా సిఐడిని రంగంలోకి దించి మరీ ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాలపై దృష్టి పెడుతోంది.
ఇక చానళ్లు, పత్రికల విషయానికి వస్తే వైసిపి ఆవిర్భావం నుంచి తీవ్రంగా తమ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కోపం అసహనం జగన్ లో ఎక్కువగా ఉంది.ఎల్లో మీడియా గా కొన్ని చానళ్లు, పత్రికలపై ముద్ర వేసి మరి తరచుగా విమర్శలు చేస్తూనే వచ్చారు.
జగన్ విమర్శలకు తగ్గట్టుగానే సదరు మీడియా జగన్ వ్యతిరేక కథనాలు వండి వార్చుతూ వస్తున్నాయి.
ఏడాది క్రితం ఏపీలో అధికారపగ్గాలు చేపట్టిన వైసిపి, మీడియాను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేసే విధంగా ప్రత్యేకంగా జీవోను కూడా విడుదల చేసింది.
అయినా టిడిపి అనుకూల మీడియా గా పేరుపడ్డ కొన్ని చానళ్లు, పత్రికలు ఏపీ ప్రభుత్వంను ఏమాత్రం లెక్క చేయని విధంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం టీవీ 5 డిబేట్ యాంకర్ మూర్తిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ పెద్ద హడావుడి జరిగింది.
అయితే ఆ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించినా, ఇప్పుడు మాత్రం సదరు టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు, ఛానల్ యాంకర్ మూర్తి పై కేసు పెట్టినట్లుగా తెలుస్తోంది.కొద్ది రోజుల క్రితం టీవీ 5 లో యూనివర్సిటీల పాలకమండలి నియామకాలకు సంబంధించిన కథనం వచ్చింది.
ఆ కథనంలో నోట్ ఫైల్ చూపిస్తూ కథనాన్ని ప్రచారం చేశారు.ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ తీసుకుంది.ఆ నోట్ ఫైల్ రహస్యమని, దాన్ని టీవీ 5 దొంగలించడం, లేక ఫోర్జరీ చేయడం జరిగిందని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ ఉన్నత విద్యాశాఖ చూస్తున్న సతీష్ చంద్ర అనే ఉన్నతాధికారి ఫిర్యాదు చేశారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో ఏ వన్ గా శ్రవణ్ కుమార్ అనే న్యాయవాదిని, ఏ 2 గా టీవీ ఫైవ్ చైర్మన్ బి ఆర్ నాయుడు, ఏ 3 గా ఈ వార్తను ప్రజెంట్ చేసిన మూర్తిని చేర్చారు.
దీని కోసం గతంలో విడుదల చేసిన మీడియా జీవోను ప్రాతిపదిక గా తీసుకున్నారు.
చాలాకాలంగా తమకు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో టీవీ 5 పై ఏపీ ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుంది అనే వాదనలు వస్తున్నాయి.అయినా ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించటం చూస్తుంటే తమకు వ్యతిరేకంగా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టబోమనే సంకేతాలను ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.