ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య నిప్పు౦-ఉప్పులా వాతావరణం ఉంది.అధికార పార్టీ వైసీపీ టీడీపీని లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ మీద ప్రజలలో ఉన్న కనీసమైన గౌరవం కూడా లేకుండా చేయాలని ప్రణాలికలు వేసుకొని రాజకీయ దాడులు చేస్తుంది.
మరో వైపు టీడీపీ కూడా తన అనుకూల మీడియాని ఉపయోగించుకొని అధికార పార్టీ పరిపాలనలో పూర్తిగా వైఫల్యం అయ్యిందని ప్రచారం చేస్తుంది.అమరావతిని బూచిగా చూపిస్తుంది.
అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒకప్పుడు చంద్రబాబు తరహాలో ప్రతిసారి మీడియా ముందుకి వచ్చి ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం లేదు.ముందుగా తన పరిపాలన బాద్యతలు చూసుకుంటూ ప్రజా సంక్షేమం అభివృద్ధి మీద దృష్టి పెడుతూ వెళ్తున్నాడు.
అయితే తన పార్టీ నాయకుల ద్వారా మాత్రం టీడీపీ మీద విమర్శలతో దాడులు చేయిస్తున్నారు.
అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ, సిఏఏ, ఎన్పీఆర్ అంశం ఆందోళనకి కారణం అవుతుంది.
ఒక వర్గం ప్రజలు ఈ బిల్లులని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.ఇక ఏపీలో కూడా ముస్లిం, మైనార్టీ సంఘాల వారు ఎనార్సీ, ఎన్పీఆర్ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ని ఇప్పటికే కోరారు.
దీనిపై జగన్ కూడా వారికి హామీ ఇచ్చారు.ఎన్పీఆర్ లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, అంత వరకు ఏపీలో దానిని అమలు చేయకుండా బిల్లు పాస్ చేస్తామని చెప్పారు.
ఎన్నార్సీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ఇప్పుడు ముస్లిం సంఘాల వారు ప్రతిపక్ష నేత చంద్రబాబుని కూడా కలిసి ఎన్పీఆర్ కి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే బిల్లుకి అసెంబ్లీలో మద్దతు ఇవ్వాలని కోరారు.
బాబు కూడా దీనిని పరిశీలించి కచ్చితంగా అధికార పార్టీ బిల్లు ప్రవేశపెడితే తాము కూడా అనుకూలంగా ఓటు వేస్తామని చెప్పారు.మొత్తానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఈ ఎన్పీఆర్ బిల్లు విషయంలో మొదటి సారి ఒకే మాట వినిపించడానికి సిద్ధమయ్యాయి అని రాజకీయ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు.
అయితే జనసేన మాత్రం బీజేపీతో కలిసి వెళ్ళడం వలన వీటిని బహిరంగంగా కూడా మద్దతు ప్రకటించే అవకాశం లేదని తెలుస్తుంది.