గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న వైసిపి గన్నవరం ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు కాస్త మెత్తబడినట్టు కనిపిస్తోంది.తన రాజకీయ ప్రత్యర్ధి వంశీ వైసీపీ లోకి వస్తే తాను రాజకీయంగా బాగా వెనుకబడిపోవడమే కాకుండా, తనకు భవిష్యత్తు ఉండదని ఇప్పటి వరకు యార్లగడ్డ పార్టీ నేతల దగ్గర తన ఆవేదనను చెప్పుకున్నాడు.
అయితే ఈ విషయంలో మంత్రి కొడాలి నాని పేర్ని నాని జోక్యం చేసుకుని వంశీ, యార్లగడ్డ మధ్య ఉన్న వివాదాన్ని జగన్ దగ్గరకు తీసుకువెళ్లారు.దీనిపై స్పందించిన జగన్ వంశీ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, మీ రాజకీయ భవిష్యత్తును తాను చూసుకుంటానని, అనవసరంగా ఈ విషయంలో టీడీపీకి లోకువ అవ్వవద్దని సూచించారట.
దీంతో యార్లగడ్డ జగన్ చెప్పినదానికి ఒకే చెప్పారట.జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం ఒకే కారులో మంత్రి కొడాలి, పేర్ని నాని, యార్లగడ్డ వెళ్లిపోయారు.
గతంలో తనమీద అసత్య ఆరోపణలు చేస్తూ వైసిపి సానుభూతిపరుడితో ఫిర్యాదు చేయించాడని, ఆ ఫిర్యాదు ఆధారంగా ఎటువంటి విచారణ చేయకుండానే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని వంశీ ఆరోపించారు.అంతేకాదు దీనిపై తగిన ఆధారాలతో హైకోర్టు ను కూడా ఆశ్రయిస్తానని అప్పట్లో వంశీ ప్రకటించారు.
ప్రస్తుతం జగన్ వద్ద ఇద్దరి పంచాయతి ముగిసిన నేపథ్యంలో కేసులు, ఆరోపణలు వెనక్కి తీసుకుని ఐక్య రాగం వినిస్తారా అనేది చూడాలి.