మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ దేశంలో వరకట్న వేధింపులు మాత్రం ఆగడం లేదు.వరకట్నం కోసం వేధిస్తూ దారుణంగా హింసిస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
తాజాగా ఒరిస్సాలోని బొరోడియా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.ఇంటి కోడలిని అత్త, మామ, ఆడపడచు కలిసి మంచానికి కట్టేసి నిప్పు పెట్టి కాల్చారు.
అడిగినంత అదనపు వరకట్నం తీసుకురాలేదనే కారణంతో యువతిని దారుణంగా చిత్రహింసలు పెట్టారు.
పూర్తి వివరాలలోకి వెళితే రస్మిత సాహు అనే యువతికి విక్రమ దాస్ అనే వ్యక్తితో 2018 సంవత్సరం జూన్ నెలలో వివాహం జరిగింది.
రస్మిత తల్లిదండ్రులు ఒప్పందం ప్రకారం చెప్పిన కట్నకానుకలన్నీ సమర్పించారు.కానీ యువతి అత్తింటివారికి మాత్రం ధనదాహం తీరలేదు.ఇచ్చిన కట్నం సరిపోలేదని తరచూ యువతిని అదనపు కట్నం తీసుకొనిరావాలని వేధించసాగారు.
వేధింపులు ఎక్కువ కావడంతో యువతి తల్లిదండ్రులకు చెప్పగా యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో వరకట్నం కోసం తమ కూతురిని వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.
పోలీసులు హెచ్చరించటంతో రస్మిత అత్తామామలు తమ కోడలిని కట్నం కోసం వేధించము అని పోలీసుల ముందు చెప్పి ఆ తరువాత యువతిని మంచానికి కట్టేసి కిరసానాయిల్ పోసి నిప్పు పెట్టారు.శనివారం రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య ఉంది.యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
.