ఇటీవలే కాలంలో లైంగిక వేధింపులు పెరుగుతూ పలు దారుణాలకు దారితీస్తున్నాయి.లైంగిక కోరికలు తీర్చాలంటూ వేధిస్తున్న పక్కింటి తాగుబోతును ( Drinker ) ఓ యువతి కత్తితో పొడిచి హత్య చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా( Mulugu District ) ఏటూరు నాగారం మూడో వార్డులోని ఎర్రేళ్ళవాడ లో సంగీత ( Sangeeta ) అనే యువతి తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది.సంగీతకు తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరూ లేని కారణంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది.
ఇదే ప్రాంతానికి చెందిన రాంటెంకి శ్రీనివాస్ (25) తన భార్య, పిల్లలు వదిలేసి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉంటూ తరచూ మద్యం తాగి సంగీత ఇంటికి వెళ్లి లైంగిక కోరికలు తీర్చాలని వేధించేవాడు.వేధింపులు క్రమంగా పెరుగుతూ ఉండడంతో సంగీత ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
ఇటీవలే శ్రీనివాస్ బెయిల్ పై బయటికి వచ్చాడు.తన వక్రబుద్ధిని మార్చుకోకుండా సంగీతను లైంగిక కోరికలు తీర్చాలంటూ వేధించడం ప్రారంభించాడు.ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి కూడా పీకలదాకా మద్యం తాగి సంగీత ఇంటికి వెళ్లి బలవంతం చేశాడు.
శ్రీనివాస్ ఆగడాలు మితి మీరడంతో విస్తు పోయిన సంగీత ఏం చేయాలో అర్థం కాక, శ్రీనివాస్ చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య చేసింది.
బుధవారం రాత్రి రెండు గంటల సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని అంతా చెప్పి లొంగిపోయింది.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాస్ మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతుదేహాన్ని ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు.శ్రీనివాస్ ను, సంగీత పొడిచి చంపి మంచి పని చేసిందని చుట్టుపక్కల వారు హర్షం వ్యక్తం చేశారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.