కేరళలో నడిరోడ్డు పై దారుణ ఘటన చోటుచేసుకుంది.ఒక మహిళా పోలీస్ అధికారిణి పై మరో ట్రాఫిక్ పోలీస్ దారుణానికి పాల్పడ్డ ఘటన కేరళ లోని అలపుజా జిల్లా లో చోటుచేసుకుంది.
తాజా గా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే… సౌమ్య పుష్పకరన్ అనే మహిళా పోలీస్ అధికారిణి మావిలిక్కర లోని వల్లికున్నం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంది.
అయితే విధులు ముగించుకొని ఆమె ద్విచక్ర వాహనం పై వెళుతుండగా వెనుకనుంచి వచ్చిన ట్రాఫిక్ పోలీస్ అజాజ్ తన కారు తో తొలుత ఢీ కొట్టాడు.దీనితో ఆమె కిందపడిపోగా,వెంటనే కారులోంచి కత్తి తీసుకొని బయటకు వచ్చిన అజాజ్ ను చూసి సౌమ్య భయం తో పరుగులు తీసింది.
అయినప్పటికీ దుర్మార్గుడు వదలకుండా ఆమెను వెంబడించి కత్తి తో ఒక్క వేటు వేశాడు.దీనితో సౌమ్య అక్కడికక్కడే కుప్పకూలాగా మరో చేతిలో ఉన్న పెట్రోల్ తీసి ఆమె పై పోసి నిప్పు అంటించాడు.
దీనితో సౌమ్య మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయింది.ఈ క్రమంలో నిందితుడు అజాజ్ కు కూడా గాయాలు కావడం తో అతడిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ప్రస్తుతం అజాజ్ ను పోలీసులు తమ కస్టిడీ లోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది.అసలు సౌమ్య,అజాజ్ ల మధ్య చోటుచేసుకున్న వైరం ఏంటి,ఇంత దారుణానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సౌమ్య పై కక్ష తో ఇంత దారుణానికి గల కారణాలు ఏంటి అన్న దానిపై అధికారులకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.
ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇటీవల యూపీ లో బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పై మరో లాయర్ కాల్పులు జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే.ఇంకా ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు ఒక మహిళా పోలీస్ అధికారిణి పై మరో ట్రాఫిక్ పోలీస్ ఈ విధంగా దారుణానికి పాల్పడడం మాత్రం అందరిని కలవరపెడుతుంది.
ఒకే వృత్తి లో ఉన్న అధికారుల మధ్య ఈ విధంగా హత్య లు చేసేంత కక్షలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం అనే చెప్పాలి.