ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో సోషల్ మీడియా వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.సోషల్ మీడియా ద్వారా దూరంగా ఉన్న స్నేహితులు, బంధువులతో పరిచయాలు ఏర్పడతాయి.
అదే సమయంలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చాలామందికి అపరిచిత వ్యక్తులు పరిచయమవుతున్నారు.అపరిచిత వ్యక్తులతో పరిచయాలు చాలా సందర్భాల్లో అవతలి వ్యక్తులను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది.
తాజాగా ఒక ఘటనలో ఫేస్ బుక్ పరిచయం ఒక మహిళ 17 లక్షల రూపాయలు పోగొట్టుకోవడానికి కారణమైంది.బోయిన్ పల్లికి చెందిన 67 సంవత్సరాల మహిళ టీచర్ గా పని చేసి రిటైర్ అయింది.
సోషల్ మీడియాపై అవగాహన ఉండటంతో ఫేస్ బుక్ ఖాతా ద్వారా విద్యార్థులతో, ఇతర టీచర్లతో చాట్ చేసేది.అయితే ఆమెకు కొన్ని రోజుల క్రితం లండన్ కు చెందిన పాల్ అనే డాక్టర్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.
ఆ వ్యక్తి తనకు పరిచయం లేకపోయినప్పటికీ మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది.ఆ తరువాత ఆన్ లైన్ చాటింగ్ ద్వారా ఒకరితో మరొకరికి పరిచయం పెరిగింది.
అనంతరం ఫోన్ నంబర్లను తెలుసుకుని ఒకరితో మరొకరు చాటింగ్ కూడా చేసేవారు.ఒకరోజు పాల్ ఆ మహిళకు ఒక గిఫ్ట్ పంపిస్తున్నానని చెప్పాడు.
పాల్ గిఫ్ట్ పంపిస్తున్నానని చెప్పడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆ బహుమతి కోసం మహిళ ఎదురుచూస్తున్న సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి అని చెప్పి కొందరు మోసగాళ్లు ఆ మహిళకు లండన్ నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయని చెప్పి విడతల వారీగా ఆమె నుంచి 17 లక్షల రూపాయలు ఖాతాలలో వేయించుకున్నారు.
ఆ తర్వాత కూడా డబ్బులు డిపాజిట్ చేయాలని.లేకపొతే కోర్టులో కేసు నమోదవుతుందని ఆ మహిళను బెదిరించారు.
సదరు మహిళ పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.