ప్రస్తుతం మన ప్రపంచం ఆధునిక టెక్నాలజీతో ఎంతో ముందుకు సాగుతున్నప్పటికీ, కొంత మంది మాత్రం ఎంతో వెనుకబడి ఉన్నారు.కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు వంటివి చేస్తే వారికి అదృష్టం కలిసి వస్తుందనే మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు.అలాంటి మూఢనమ్మకాలను నమ్మేవారు ఎంతటి సాహసానికైనా ఒడికడతారు.ఇలాంటి తరుణంలోనే ఇలాంటి మూఢనమ్మకంతో ఏకంగా ఓ కన్న తల్లి తన కొడుకును అతి దారుణంగా చంపిన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే…
పశ్చిమబెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లా బిధాన్నగర్లో గీత అనే మహిళ తాంత్రిక పూజలు చేస్తే తనకు శక్తులు లభిస్తాయనే మూఢనమ్మకంతో ఏకంగా తన కన్న కొడుకు అర్జున్(25)ను తన చిన్న కుమారుడు విదుర్ తో కలిసి రోకలిబండతో అర్జున్ తలపై కొట్టి దారుణంగా చంపారు.తరువాత అతని మృతదేహానికి కర్పూరం, నెయ్యి పోసి తన ఇంట్లోనే దహనసంస్కారాలు నిర్వహించింది.
ఈ సంఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తన తల్లి గీత, విదుర్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ విచారణలో భాగంగా తాంత్రిక పూజ చేయటం వల్ల తనకు శక్తులు వస్తాయని తెలియడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది.అయితే దహనసంస్కారాలు చేసేటప్పుడు మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు తన కొడుకు శరీరానికి కర్పూరం, నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలను పూసినట్లు పోలీసుల విచారణలో తేలింది.గీత, విధుర్ లపై కేసులు నమోదు చేసి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఇలాంటి తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు నమ్మేవారు ఎక్కువగా ఉండడంతో ఇలాంటి సంఘటనలు పలు ప్రాంతాలలో ఇప్పటికీ జరుగుతున్నాయి.ఇలాంటి మూఢనమ్మకాలతో ఎంతో మంది వారు నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్న సంఘటనలు చాలా ఉన్నాయి.