దేశంలో ఒకవైపు కరోనా మరోవైపు వరదలతో అల్లకల్లోలం అవుతుంది.గత కొద్దీరోజుల నుండి వరదలతో బీహార్ రాష్ట్రంలోని ప్రజలు అల్లాడిపోతున్నారు.
బీహార్ లోని 25 ఏళ్ల మహిళ ఎన్డీఆర్ఎఫ్ బోటులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.తూర్పు చంపారన్ జిల్లాలోని గోబరి గ్రామానికి చెందిన బాధిత మహిళ ఇల్లు వరదలకు మునిగిపోయింది.
దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మహిళను రక్షించి తమ బోటులోకి ఎక్కించారు.నిండు గర్భిణి అయిన ఆమెలో అప్పటికే పురుటి నొప్పులు మొదలైయ్యాయి.అయితే ఆమె ఆదివారం మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో బోటులోనే ప్రసవించింది.బోటులోనే ఉన్న ఆశా కార్యకర్త మహిళ ప్రసవానికి సాయం అందించినట్టు ఎన్డీఆర్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు ఢిల్లీలో తెలియజేశారు.
అయితే బుద్ధి గండక్ నది ఉప్పొంగి గ్రామంలోకి వరద నీరు చేరుకోవడంతో బాధిత మహిళ ఇల్లు మునిగిపోయిందన్నారు.గర్భిణి గురించి సమాచారం అందడంతో ఎన్డీఆర్ఎఫ్ 9వ బెటాలియన్ సిబ్బంది ఆమెను రక్షించారని ఆయన వివరించారు.
అంబులెన్స్ ద్వారా మోతిహరి జిల్లాలోని బంజారియా గ్రామంలోని ప్రజారోగ్య కేంద్రానికి తల్లీబిడ్డలను తరలించినట్టు తెలిపారు.
ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు.అయితే అత్యవసర సమయాల్లో ప్రసవం ఎలా చేయాలనే విషయమై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శిక్షణ పొందినట్టు వెల్లడించారు.2013 నుంచి ఇప్పటి వరకు విపత్తు నిర్వహణ సమయాల్లో 10 మంది పిల్లలు ఎన్డీఆర్ఎఫ్ బోట్లలోనే జన్మించినట్టు అధికారి తెలిపారు.వీరిలో కవలలు కూడా ఉన్నారని తెలిపారు.