పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు పేర్లను ఎలా పెడతారు?కొందరు వారి జన్మనక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరాన్ని బట్టి పెడితే,మరికొందరు వారి వారి పెద్దల పేర్లను పెడతారు.ఇంకొందరు తమకు ఇష్టమైన వారి పేర్లను లేదా వారి ఇష్టదైవం పేర్లను పెడతారు.
ఇంకొందరు వారికి సాయం చేసిన వారి పేర్లను పెడతారు.ఇక్కడ ఈ మహిళ కూడా తనకు సాయం చేసిన వారి పేరునే తన బిడ్డకు పెట్టుకుంది.
ఆ బిడ్డ పేరు జర్నలిస్ట్.ఈ పేరుకి ఆ బిడ్డకు ఉన్న సంబంధం ఏంటంటే.
పద్దెనిమిదేళ్ల అయిమోని పయేంగ్ నిండు గర్భిణీ… నెలలు నిండిన అయిమోని ఒకరోజు నొప్పులతో బాధపడుతుంది.దాంతో మజూలీలోని గర్మూర్ పీతాంబర్ దేవ్ గోస్వామీ ప్రభుత్వాసుపత్రికి డెలివరీ కోసం ఆమెను తీసుకెళ్లారు కుటుంబసభ్యులు.కానీ డాక్టర్లు డెలివరీకి ఇంకా సమయం ఉందన్న కారణంతో కాన్పు చేయడానికి నిరాకరించారు.నాలుగైదు రోజుల తర్వాత మళ్లీ రమ్మన్నారు.ఆస్పత్రికి, అయిమోని నివసించే పత్రీసుక్ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరం.కానీ ఆ ఊళ్లోకి సరైన రోడ్డు లేదు.
నది కూడా ప్రవహిస్తుంటుంది.నది దాటి ఊళ్లోకి వెళ్లాలి.
దీంతో ప్రయాణం అడుగడుగునా నరకమే.డాక్టర్లు కాన్పు కుదరదనడంతో చేసేదేమీ లేక ఆమె ఇంటికి తిరుగు ముఖం పట్టారు.
బోటు ఎక్కి నదిలో వెళ్తుండగా ఉరుములతో వర్షం.ఇంతలో నొప్పులు ఎక్కువయ్యాయి.
ఆమెకు దిగ్గుతోచలేదు.మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నారు కుటుంబ సభ్యులు.
చివరకు నది ఒడ్డునే బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది.అయితే నది ఒడ్డున కూడా కాన్పు అంత సులువేమీ కాలేదు.
అప్పుడే అటువైపు నుంచి వెళ్తున్న ఇద్దరు యువ జర్నలిస్టులు ఆమెకు ఎంతో సాయం చేశారు.
చుట్టుపక్కల అందుబాటులో ఉన్న మహిళల్ని అక్కడికి తీసుకొచ్చారు.
డెలివరీ సురక్షితంగా అయ్యే వరకు అక్కడే ఉన్నారు.ఆ తర్వాత తల్లీబిడ్డల్ని ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేశారు.కష్టసమయాల్లో సాయం చేయడం మాత్రమే కాదు… సరైన రవాణా వ్యవస్థ లేకుండా ఇబ్బందులు పడుతున్న గ్రామాల గురించి ఆ ఇద్దరు జర్నలిస్టులు అనేక కథనాలు రాశారంటున్నారు స్థానికులు.25,000 జనాభా ఉన్న గ్రామాలకు సరైన రోడ్డు లేదు.అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు.కేవలం అయిమోని మాత్రమే కాదు ఎందరో మహిళలు పడవల్లోనే డెలివరీ అయిన సంధర్బాలెన్నో.ఇప్పుడు అయిమోనిది అదే పరిస్థితి,నది ఒడ్డున బిడ్డకు జన్మనిచ్చింది.అయితే సురక్షితంగా డెలివరీ అయ్యేందుకు ఎంతో సాయం చేసిన జర్నలిస్టులకు ఎలా కృతజ్ఞత చెప్పాలో ఆ తల్లికి అర్థం కాలేదు.
అందుకే తన కొడుకుకు సంగ్బాదిక్(జర్నలిస్ట్) అని పేరు పెట్టింది.
ఈ ఘటన జరిగిన మజూలీ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించేది ఎవరో కాదు… అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్.ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ఆశ్చర్యకరం.గర్భిణీలు నొప్పులతో అల్లాడుతున్న సమయంలో జర్నలిస్టులే స్వయంగా వెళ్లి సాయం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
గత నెలలో కూడా కొందరు రిపోర్టర్లు ఓ గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.ఆ బిడ్డకు ‘న్యూస్ మోని’ అని పేరు పెట్టారు.న్యూస్ అంటే వార్త, మోని అంటే రత్నం అని అర్థం.అంటే ఆ బిడ్డ పేరు ‘వార్త రత్నం’.
ఏదేమైనా జర్నలిస్టులంటే కేవలం వార్తలు రాసి… ప్రజల సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే మధ్యవర్తులు మాత్రమే కాదు… కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండేవాళ్లు అని నిరూపిస్తున్నారు అక్కడి జర్నలిస్టులు.హ్యాట్సాఫ్ దెమ్.