అవును నిజమే మరి.వ్యవసాయం చేయాలంటే నిజంగా డిగ్రీలే చదవక్కర్లేదు.
కొంత అవగాహన ఉంటే చాలు.దానికి తోడు పట్టుదల, కృషి, కష్టపడే తత్వం తోడైతే భూమిలో బంగారాన్ని పండించవచ్చు.
అవును, మీరు విన్నది నిజమే.సరిగ్గా ఆ మహిళ కూడా ఇదే చేస్తోంది.
ఒక ఎకరంలో కేవలం ఏడాది కాలంలోనే ఏకంగా 15 రకాల పంటలను పండిస్తోంది.అవి కూడా ఆర్గానిక్ పంటలు.
ఈ క్రమంలో ఆ మహిళ అలా పండించిన పంటలలో కొంత కుటుంబ అవసరాలకు వాడుకుంటూనే మరోవైపు మిగిలిన పంటలను మార్కెట్లో విక్రయిస్తూ లాభాలు గడిస్తోంది.ఇంతకీ అసలు ఆ మహిళ ఎవరంటే…
ఆమె పేరు వనిత బల్భీమ్ మన్షెట్టి.
వయస్సు 35 సంవత్సరాలు.ఉంటున్నది మహారాష్ట్రలోని ఒస్మానాబాద్ జిల్లా చివ్రి అనే గ్రామంలో.
అయితే వనిత భర్త ఓ కాంట్రాక్టర్.రోడ్లు వేయించడం, వంతెనలు కట్టించడం వంటి పనులు చేయిస్తుంటాడు.
ఇక వీరు ఇంట్లోనే గేదెలను పెంచుతాయి.దాంతో పాల వ్యాపారం చేస్తున్నారు.
ఈ క్రమంలో వనిత ఓసారి Swayam Shikshan Prayog (SSP), Krishi Vigyan Kendra (KVK) అనే రెండు సంస్థలు నిర్వహించిన వర్క్షాప్లో పాల్గొంది.అందులో చాలా మంది మహిళలు కూడా పాల్గొన్నారు.
వారికి one-acre farming model అనే ఓ కొత్త వ్యవసాయ పద్ధతిని నేర్పించారు.దీని వల్ల ఏం జరుగుతుందంటే కేవలం ఒక ఎకరం ఉన్నా చాలు అందులో ఏడాదికి రెండు సీజన్లలో ఏకంగా ఒక్కో సీజన్కు 10 నుంచి 15 పంటలను ఒకే ఎకరంలో పండించవచ్చు.
అది కూడా ఎలాంటి కెమికల్ ఎరువులు వాడకుండా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో ఆ పంటలను పండించవచ్చు.దీంతో ఇలాంటి వ్యవసాయ పద్ధతిపై వనితకు ఆసక్తి కలిగింది.
వెంటనే తన ఆసక్తిని ఆచరణలో పెట్టింది.
గ్రామంలోనే తాము ఉంటున్న ఇంటికి దగ్గర్లో 3 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నారు వనిత దంపతులు.అయితే వనిత ఒక ఎకరంలో వ్యవసాయం చేయడం ప్రారంభించగా, ఆమె భర్త రెండు ఎకరాల్లో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు.మొత్తం 3 ఎకరాల్లోనూ పైన చెప్పిన వన్ ఎకర్ ఫామింగ్ మోడల్ తరహా వ్యవసాయాన్ని చేపట్టారు.
ఈ క్రమంలో ఒక్కో ఎకరంలో 15 రకాల పంటలను వేశారు.వాటిల్లో తృణధాన్యాలు, కూరగాయలు, ఆకు కూరలు వంటి రక రకాల పంటలు ఉండేవి.అయితే వారి ప్రయత్నం ఫలించింది.పంటలు బాగా పండాయి.
దీంతో 2014లో వారు అలా ప్రారంభించిన వన్ ఎకర్ ఫామింగ్ మోడల్ వ్యవసాయం ఇప్పటికీ కొనసాగుతోంది.కాగా కేవలం 2015లోనే వారు తమ పొలాల్లో ఏకంగా 3900 కిలోల పంటలను పండించారు.
అందులో 25 శాతం పంటలను కుటుంబ అవసరాల కోసం అట్టే పెట్టుకున్నారు.మిగిలిన 75 శాతం పంటలను మార్కెట్లో అమ్మగా భారీ లాభాలు వచ్చాయి.పెట్టుబడికి ఎకరానికి రూ.9,600 మాత్రమే ఖర్చు చేయగా లాభాలు దాదాపుగా 4 రెట్లు వచ్చాయి.
నిజానికి వనిత చదువుకున్నది 8వ తరగతి వరకు మాత్రమే.కానీ పైన చెప్పిన ఆ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన వర్క్ షాప్ వల్లే ఆమెకు ఇది సాధ్యమైంది.
దానికి తోడు తన శ్రమను కూడా అందులో పెట్టుబడిగా పెట్టింది.ఇప్పుడు లాభాలను ఆర్జిస్తోంది.ఆమెకు 4 మంది కుమార్తెలు.పెద్ద కుమార్తె డిగ్రీ చదువుతుండగా, అందరి కన్నా చిన్న కుమార్తె 7వ తరగతి చదువుతోంది.
ఇంత చేసినా ఆమె చెబుతోంది ఒక్కటే.తన కుటుంబం ఆరోగ్యంగా ఉండడం కోసం ఆర్గానిక్ ఫామింగ్ చేయడం తప్పనిసరి అని అంటోంది.
దీంతో తనకు ఆర్థికంగా కూడా లబ్ది చేకూరుతున్నందున భవిష్యత్తులోనూ ఈ తరహా వ్యవసాయాన్ని కొనసాగిస్తానని అంటోంది.అవును మరి, నిజానికి వ్యవసాయం చేయాలంటే పెద్ద డిగ్రీలే అక్కర్లేదు.
కొంచెం అర్థం చేసుకునే పరిజ్ఞానం, శ్రమ ఉంటే చాలు.ఎవరైనా వ్యవసాయంలో లాభాలు ఆర్జించవచ్చు కదా.!
.