అధికారం మదంతో కనీసం ఆలోచన లేకుండా రాజకీయ నేతలు రెచ్చిపోతూ ఉంటారు.ఒక్కోసారి ప్రభుత్వ అధికారుల మీద ఇష్టానుసారంగా దాడులకి పాల్పడుతూ ఉంటారు.
అయితే ఇలాంటి సందర్భాలలో పార్టీ అధిష్టానం తమ నేతలు చేసిన తప్పులని చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది.గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో మీద భౌతిక దాడి చేస్తే, దానిని చంద్రబాబు వెనకేసుకొని వచ్చారు.
ప్రతిగా దాడికి గురైన ఎమ్మార్వో మీదని చర్యలు తీసుకున్నారు.ఆ సంఘటన టీడీపీ పరిపాలనకి పెద్ద మచ్చగా మిగిలిపోయింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి ఆ సంఘటన కూడా ఒక కారణం అని చెప్పాలి.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణాలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, కాగజ్ నగర్ మండలంలో ఓ అటవీశాఖ అధికారి మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ కర్రలతో దాడి చేసి ఆమె చేయి విరిగిపోవడానికి కారణం అయ్యాడు.
ఈ ఘటనకి సంబంధించి వీడియోలు బయటకి రావడంతో ఈ సంఘటన ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.ఒక ప్రభుత్వ అధికారిపై అధికార మదంతో దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ కూడా కోనేరు కృష్ణపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.దీంతో తప్పనిసరి పరిస్థితిలో అతను జెడ్పీ వైస్ చైర్మన్ పదవికి, అలాగే జెడ్పీటీసికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈ సంఘటన మీద ఐఎఫ్ఎస్ సంఘం కూడా నిరసన తెలియజేసింది.దీంతో నేరుగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి అటవీశాఖ అధికారి అనిత మీద దాడి చేసిన వారి మీద కేసులు బుక్ చేసారు.
ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ, సిఐలని సస్పెండ్ చేసారు.దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.ఇక ఈ ఘటన మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సదరు నేత మీద ఆగ్రహం వ్యక్తం చేసారు.ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యం చేస్తే ఎంతటి వారైన క్షమించేది లేదని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పష్టం చేసాడు.