యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని మనస్తాపానికి గురై,గుండె ఆగి మృతి చెందిన ఒంటరి మహిళ ఘటనపై,డబుల్ బెడ్ రూం ఇళ్ళ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని వై.ఎస్.ఆర్ టిపి జిల్లా అధ్యక్షులు అతహర్ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్నా డబుల్ బెడ్ రూం అన్హరురాలుగా ప్రకటించడంతో 30 వ వార్డ్ పహాడి నగర్ కి చెందిన ఒంటరి మహిళా మౌలా బేగం మనస్థాపానికి గురై గుండెపోటుతో ఆదివారం మృతి చెందడం బాధాకరమన్నారు.
అసలు అధికారులు విచారణ ఎలా చేపడుతున్నారో అర్దం కావడం లేదని, మృతురాలికి సొంత ఇళ్ళు లేకున్నా ఇళ్ళు ఉందని అన్హరురాలుగా ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు.
ఆమె ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంటిలో ఉంటూ,ఒంటరి మహిళ పెన్షన్ పొందుతూ జీవనం గడుపుతున్నారన్నారు.
అధికారుల తప్పిదం వలన ఆమె మృతి చెందిందని, ఆమెకు సొంత ఇళ్ళు ఉందని అధికారులు రుజువు చేయాలని సవాల్ చేశారు.ఆమె కుటుంబానికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించి ఆదుకోవాలని,మౌలా బేగంకు మృతికి కారణమైన అదికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మౌలా బేగం కుటుంబానికి న్యాయం చేయని యెడల రాష్ట్ర మైనారిటీ కమిషన్ ను ఆశ్రయిస్తామన్నారు.అంతే కాకుండా చాలా మంది ఇళ్ళు లేని వారిని అన్హరులుగా ప్రకటించి సొంత ఇళ్ళు ఉన్న వారిని అర్హులుగా ప్రకటించడం ద్వారా అవకతవకలు జరిగాయని తెలుస్తుందన్నారు.
అధికారులు కేవలం ఒక చోట కూర్చుని విచారణ చేయడం సరైంది కాదని, వారు ప్రతీ ఇంటికి తిరిగి ఎంక్వైరీ చేయాలని, అవసరం అయితే వార్డ్ పెద్దలతో ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా సమాచారం సేకరించి, తిరిగి అర్హుల జాబితా తయారు చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అధికారులను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం పార్టీ నాయకులు నివాస్, రాకేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.