పూలు కళ్లకు అందంగా కనిపిస్తాయి.పూలను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత కలుగుతుంది.
ఒక్కొక్క పూవుది ఒక్కో సువాసన.పూల రంగు, సువాసనల ప్రభావం మనిషి మీద ఉంటుంది.
ఈ పూల రేకులలో, మొక్కలలోని హార్మోన్లు ఉంటాయి.ఇవి మనిషికి మేలు చేసేవి.
అందుకే ఔషధాల తయారీలో పూలను వాడుతారు.అయితే.
మనిషిని, మనసును కట్టిపడేసిన పూలు వాడిపోయాక ఎవరైనా ఏం చేస్తారు.బయటకు విసిరి పడేస్తారు.
అంతే కదా.కానీ వాడిపోయిన పూలలోనూ వాడని అందముంటుందని నిరూపిస్తోంది ఓప్రకృతి ప్రేమికురాలు.ఎండిన ఆకులతో.వాడిపోయిన పువ్వులతో కళాకృతులు రూపొందించి ప్రకృతి అందాన్ని ఆవిష్కరిస్తోంది.
భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నీలిమ మనకందరికీ కనిపించని ప్రకృతి అందాన్ని పసిగట్టింది.ఎండిన ఆకులు, వాడిన పువ్వులు సేకరిస్తూ అద్భుతమైన కళాకృతులకు ప్రాణం పోస్తోంది.
ప్రకృతిలోని ప్రతి మార్పును నిశితంగా గమనిస్తే ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తే అద్వితీయ అనుభూతి కలుగుతుందని డా.నీలిమ చెబుతున్నారు. ఆకులను, పువ్వులను పుస్తకాల్లో పెట్టి ఎండిన తరువాత వాటిని కళాకృతులుగా రూపొందిస్తూ ప్రకృతి అందాన్ని ఆవిష్కరిస్తోంది.అంతటితో ఆగకుండా ఆ కళాకృతులను ఫోటోఫ్రేములుగా, గ్రీటింగ్ కార్డులుగా, బుకేలుగా మలిచి అందరి మన్ననలు పొందుతున్నారు.
ప్రధాన నగరాల్లో ఇలాంటి కళాకృతులకు మంచి గిరాకీ ఉంటుందని చెబుతున్నారు డా.నీలిమ.పెట్టుబడి పెద్దగా అవసరం లేని ఈ కళను నేర్చుకుని.ఇంటి నుంచే మంచి బిజినెస్ చేయోచ్చని సలహా ఇస్తున్నారు డా.నీలిమ.ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదిస్తే ఉచితంగా శిక్షణ ఇస్తాననంటున్నారు ఫ్రొఫెసర్ నీలిమ .