బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు.కానీ కొందరు మాత్రం ఈ బిర్యానీ కోసం ఎలాంటి పని చేయడానికైనా రెడీ అంటుంటారు.
తాజాగా బిర్యానీ కోసం ఓ మహిళ ప్రాణం పోయిన ఘటన వెలుగులోకి రావడంతో అందరూ అవాక్కవుతున్నారు.బిర్యానీ కోసం మహిళ ప్రాణం పోవడం ఏమిటని అనుకుంటున్నారా.? అయితే అసలు విషయం తెలుసుకోవాలంటే ఈ కింది మ్యాటర్ను చదవండి.
కోల్కతాలోని డల్హౌసీ ప్రాంతానికి చెందిన ఫాల్గుణి బసు అనే మహిళ తన ఆడపడుచు శర్మిష్ట బసు కుమారుడికి బిర్యానీ వడ్డించింది.
అయితే అతడు బిర్యానీ తిన్న తరువాత వాంతులు చేసుకుని అనారోగ్యానికి గురయ్యాడు.దీంతో తన వదిన తన కొడుక్కి చద్ది బిర్యానీ పెట్టిందనే విషయంపై ఆమెతో గొడవకు దిగింది.
ఈ క్రమంలో ఫాల్గుణిపై శర్మిష్ట దాడికి దిగింది.ఆమెను విచక్షణా రహితంగా కొట్టడంతో ఫాల్గుణికి గుండెపోటు వచ్చి అక్కడే నేలపై పడిపోయింది.
ఈ విషయం గ్రహించిన ఆమె భర్త వెంటనే ఫాల్గుణిని ఆసుపత్రికి తరలించాడు.అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
దీంతో పోలీసులు శర్మిష్ట బసును అరెస్ట్ చేశారు.కాగా ఆమె స్క్రిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతుందని, తరుచూ ఇలా వింతగా ప్రవర్తిస్తుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఏదేమైనా బిర్యానీ కోసం వదిన ప్రాణాలు తీసిన ఆడపడుచుగా శర్మిష్ట బసు మిగిలిపోయింది.మరి ఆమెకు ఎలాంటి శిక్ష పడుతుందా అని స్థానికంగా అందరూ అనుకుంటున్నారు.ఒక్కోసారి మితిమీరిన కోపం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.
కాగా ఈ కేసు స్థానికంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా బిర్యానీ కోసం ప్రాణం తీయడం ఏమిటని పలువురు చర్చించుకునేందుకు దారి తీసింది.