మనిషిని అవసరం ఎంత దూరం అయినా తీసుకు వెళ్తుందని మరో సారి నిరూపితం అయ్యింది.ఆర్థిక ఇబ్బందులు మనిషిని చెడు దారిలో తీసుకు వెళ్లడం మనం ఇప్పటి వరకు ఎన్నో సంఘటనల్లో చూశాం.
అయితే ఈసారి మరింత విభిన్నమైన సంఘటన కడలూరులో జరిగింది.సౌత్ ఇండియా మొత్తం అవాక్కవుతున్న ఈ సంఘటన పోలీసులకు ఆశ్చర్యంను కలిగించింది.
ఆర్థిక ఇబ్బందుల నుండి తేరుకోవడానికి భరణి కుమారి అనే ఎంబీఏ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్ చేసిన పని స్థానికంగా సంచలనం సృష్టించింది.ఆమె ఆర్థిక పరిస్థితికి కొందరు అయ్యో పాపం అంటున్నారు, మరి కొందరు మాత్రం ఆమె తీరును విమర్శిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కడలూరులోని మారియప్ప నగర్కు చెందిన భరణి కుమారి ఎంబీఏ పూర్తి చేసింది.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది.ఎక్కడ అయినా కూడా ఆమెకు జాబ్ పుట్టలేదు.
ఆమె అవసరాల కోసం అప్పులు చేయడం మొదలు పెట్టింది.చుట్టు పక్కల వారి వద్ద అప్పులు చేయడంతో వారు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు.
వారి ఒత్తిడితో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు.ఆ సమయంలోనే ఆమె తప్పుడు దారిలో నడవాలని నిర్ణయించుకుంది.
ఒకసారి మొబైల్లో నకిలీ నోట్ల తయారి గురించిన ఒక వార్త చూసింది.నకిలీ నోట్లను తయారు చేస్తే బాగుంటుందనే అభిప్రాయంకు వచ్చింది.
నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలో రెండు మూడు రోజుల పాటు యూట్యూబ్లో నేర్చుకుంది.అందుకోసం కావాల్సిన పేపర్స్ను మరియు ప్రింటర్ను కొనుగోలు చేసింది.నిజమైన నోట్ల మాదిరిగా ప్రింట్ చేసేలా ప్లాన్ చేసింది.దాదాపు అయిదు లక్షల రూపాయలను ప్రింట్ చేసింది.వాటిని ఒక్కటి ఒక్కటిగా మార్పడం మొదలు పెట్టింది.తాజాగా కడలూరులోని ఒక షాప్లో రెండు వేల రూపాయల నోటును ఇచ్చింది.
నోటు తీసుకున్న షాపు యజమానికి అనుమానం వచ్చింది.వెంటనే ఆమెను ఆగమని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు వస్తున్నారని గమనించిన ఆమె బస్స్టాండ్కు వెళ్లి చిదంబరం బస్సు ఎక్కింది.పోలీసులు బస్టాండ్ అంతా గాలించి ఆమెను బస్సులో ఉన్నది గమనించి కిందకు దించి అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో తన ఆర్థిక పరిస్థితి కారణంగా దొంగ నోట్ల ప్రింటింగ్కు పాల్పడ్డట్లుగా పేర్కొంది.తనకు ఉద్యోగం లేకపోవడం వల్ల ఆర్థిక అవసరాల కోసం ఇలాంటి పని చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.భరణి కుమారిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలి ఉన్న నోట్లను మరియు ప్రింటర్ను స్వాదీనం చేసుకున్నారు.