ఏపీలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మూడు రాజధానుల అంశంతో పాటు, పరిపాలన రాజధానిగా చేస్తామని జగన్ ప్రకటించారు.దీనికి తగ్గట్లుగానే కసరత్తు చేసినా, కోర్టు ఇబ్బందులు నేపథ్యంలో విరమించుకున్నారు.
అయితే అధికారికంగా కాకపోయినా, అనధికారికంగా అయినా విశాఖ ను పరిపాలన రాజధానిగా చూపించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు.దీనికి తగ్గట్లుగానే విశాఖ నుంచి పాలనను చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అది కూడా ఈ ఉగాది తర్వాత నుంచి పూర్తిగా జగన్ విశాఖలోనే మకాం వేయబోతున్నారట.
అలాగే ఇక పూర్తిస్థాయిలో పరిపాలనను విశాఖ నుంచి జగన్ మొదలుపెట్టబోతున్నారు .ఈ మేరకు ఈ ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ఆలోచనతో ఉన్నారు .ఇది ఇలా ఉంటే ఈ ఈ ఏడాది ప్రభుత్వ పరంగా నిర్వహించే ఉగాది వేడుకలను విశాఖలో నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈనెల 22న ఉగాది పండుగ జరగనుంది.ఉగాది సందర్భంగా ప్రతి ఏడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరుగుతుంది.అయితే ఎప్పట్లా విజయవాడలో కాకుండా , ఈ ఏడాది విశాఖలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారట.
దీంతో విశాఖ పరిపాలన రాజధానిగా ఉగాది నుంచే జగన్ ఈ ప్రక్రియ మొదలు పెట్టారనే గుసగుసలు మొదలయ్యాయి.ఇప్పటికే జగన్ క్యాంపు ఆఫీసు ను చూసుకున్నారని, నివాసం కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది.విశాఖను పరిపాలన రాజధానిగా చేసే విషయంలో వైసిపి ప్రభుత్వం పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి .అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీ వ్యాప్తంగా ఉద్యమాలు నడిచాయి.కోర్టుల్లోనూ అనేక ఇబ్బందులు ప్రభుత్వానికి ఏర్పడ్డాయి.
అయినా జగన్ మాత్రం విశాఖ వైపే మొగ్గు చూపిస్తున్నారు.శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని, పరిపాలన రాజధానిగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ నే సరైనదనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు.
అందుకే ఈ విషయంలో ఎన్ని రకాల ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్న, జగన్ మాత్రం విశాఖకే జై కొడుతున్నారు.