ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా మహానటుడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవాన్నే మహానాడు అని పిలుస్తారు.అయితే టీడీపీని స్థాపించి 40 ఏళ్లు దాటడంతో గత 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా ఈ ఏడాది మహానాడు నిర్వహించాలని చంద్రబాబు తలపెట్టారు.
భవిష్యత్ ప్రయాణంపై దిశానిర్ధేశం చేసేలా ఈ కార్యక్రమం ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ఈనెల 27, 28 తేదీల్లో ఒంగోలు సమీపంలోని మండవారి పాలెంలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు టీడీపీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.
మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండోరోజు బహిరంగ సభ జరుగుతుందని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు.మొదటి రోజు జరిగే ప్రతినిధుల సభకు దాదాపు 12 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నామని.
రెండో రోజు జరిగే బహిరంగ సభను లక్షల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
అయితే తొలుత ఒంగోలులోని మినీ స్టేడియంలో మహానాడు నిర్వహించాలని టీడీపీ భావించింది.
కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.ముందుగా సంప్రదించినా కావాలనే తమకు స్టేడియం ఇవ్వలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అటు మహానాడుకు వాహనాలు సమకూర్చుకునే విషయంలో కూడా రవాణా శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వారు మండిపడుతున్నారు.
ఇటీవల తన రాయలసీమ పర్యటనలో అడుగు అడుగునా పోలీసులు తనకు ఇబ్బందులు సృష్టించారని.ఇప్పుడు మహానాడుకు కూడా అడ్డంకులు సృష్టిస్తారని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చేశారు.అయితే ప్రభుత్వం తమకు అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడును ఆపే ప్రసక్తే లేదని.
మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి తీరాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.మహానాడుకు సౌకర్యాలు అందించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చంద్రబాబు వివరించారు.
ముఖ్యంగా మహానాడు వేదిక నిర్మాణం, నేతలకు భోజన వసతి కల్పనలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు సహకరిస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.కానీ మహానాడు జరిగే ఈనెల 27, 28 తేదీల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని పోలీసులు నిలువరిస్తే ఎలా అన్న అంశంపైనా టీడీపీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు.