రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయిందని చెప్పవచ్చు.ఇటు ఎన్నికల్లోనూ గెలుపు లేక, నాయకుల మధ్యలో ఐక్యత లేక ప్రజల్లో రోజురోజుకు పలుచబడుతున్న పరిస్థితి నెలకొంది.
వరుస ఉప ఎన్నికల్లో పరాజయం పాలవుతూ, ఇక ఖచ్చితంగా నెగ్గుతుందనుకున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సైతం ఓడిపోవడంతో ఇక రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడిందనే వాదనకు బలం చేకూరినట్టయింది.అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఇంతలా దిగజారిపోతున్నా కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం నిమ్మకు నీరెత్తిన్నట్టు వ్యవహారిస్తోంది.
అయితే తెలంగాణ కాంగ్రెస్ ను హై కమాండ్ లైట్ తీసుకుందా అనే వాదన వినిపిస్తోంది.ఎప్పటి నుండో పార్టీలో ఆధిపత్య పోరుకు చరమగీతం పాడాలని, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ సూచిస్తున్నా కాంగ్రెస్ నేతలు హైకమాండ్ సూచనలను పెడ చెవినపెట్టారు.
అందుకే నేతలు మారడం లేదని పార్టీ ప్రక్షాలన చేసినా యథాతథంగా నేతలు వ్యవహరిస్తుండడంతో ఇక హైకమాండ్ వేచి చూసే ధోరణిని ఎంచుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎన్ని ఓటములు ఎదురైనా ఒక్కసారి కూడా ఓటమిపై సమీక్ష జరిపిన దాఖలాలు లేవు.
అయితే ఆధిపత్య పోరును తగ్గించుకొని ప్రజా సమస్యలపై పోరాడటంపై కాంగ్రెస్ దృష్టి పడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి కాంగ్రెస్ లో ఎప్పుడు కదలిక వస్తుందనేది చూడాల్సి ఉంది.