తెలంగాణలో రాజకీయ రణరంగం రంజుగా మారింది.పోటా పోటీ విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి.
ఈ పరిస్థితులలో వై.ఎస్.షర్మిల పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.ఇప్పటివరకు ఓ లెక్క… ఇప్పుడొక లెక్క అన్నట్లుగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించిందో అర్థం కాకపోయినా భవిష్యత్తులో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే ఇంకా పార్టీ విధి విధానాలపై ఎలాంటి ప్రకటన విడుదల కాకపోయినా కొంత మంది ఇతర పార్టీ నేతలు బహిరంగంగానే స్పందిస్తున్నారు.రాజన్న రాజ్యం షర్మిలమ్మ పార్టీతోనే సాధ్యం అన్న మాటలు చూస్తే ఎంతో మంది అసంతృప్తి నేతలు షర్మిల పార్టీని వేదికగా చేసుకొని వారు అసంతృప్తితో ఉన్న నాయకుల గెలుపుకు చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంకా పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగితే భవిష్యత్తులో ఎన్నో సంచలనాలు జరిగే అవకాశాలు లేకపోలేదు.ఎందుకంటే ప్రతి పార్టీలో ఎవరికైనా తగిన ప్రాధాన్యత దక్కదు.ఎవరైనా తమకు ప్రాధాన్యం దక్కాలని కోరుకోవడంలో తప్పు లేదు.కాని కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల ప్రాధాన్యత దక్కడంలో ఆలస్యమవుతుంది.
ఇక అంతవరకు ఓపిక పట్టని నేతలకు షర్మిల పార్టీని వేదికగా చేసుకొని స్థానికంగా తమ పట్టును మరింత పెంచుకునే అవకాశం కోసం చాలా మంది వేచి చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.షర్మిల పార్టీ ఇంకా ఎన్ని రాజకీయ సంచలనాలకు తెర లేపుతుందనేది చూడాల్సి ఉంది.