అధికారం తమకు దక్కకుండా పోతుందే అన్న బాధ టీడీపీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పుడు అధికారం దూరం అయితే మరో ఐదేళ్లపాటు అష్టకష్టాలు పడాల్సిందేనని, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని ఇప్పటి నుంచే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఇప్పుడు టీడీపీ నాయకులు ఏ ఇద్దరు కలిసినా చర్చంతా ఎన్నికల ఫలితాలపైనే.ముఖ్యంగా అన్ని పార్టీలకు ఎంతో కీలకమైన గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఏంటి ? గతంలో ఇక్కడ వచ్చినన్ని సీట్లు ఇప్పుడు వస్తాయా అనే సందేహం టీడీపీ నాయకుల్లో ఉంది.ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారిదే అధికారం అన్న సంప్రదాయం చాలా కాలంగా జరుగుతూ వస్తోంది.
ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
అలాగే ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.తూర్పు గోదావరిలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో ఈ రండు జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 సీట్లను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది.పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ చేయగా, తూర్పు లో మాత్రం 14 సీట్లను గెలిచింది.
అంతగా అక్కడ టీడీపీ తన ప్రభావం చూపించింది.అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఈ రేంజ్ లో సీట్లు సాధించడానికి పెద్ద కారణమే ఉంది.
అప్పట్లో మోదీ గాలి బలంగా వీయడంతో పాటు పవన్ కల్యాణ్ ప్రచారం కూడా టీడీపీకి బాగా కలిసొచ్చింది.అయితే ఇప్పుడు వారంతా టీడీపీకి బద్ద శత్రువులుగా మారిపోయారు.
ప్రస్తుతం జనసేన పార్టీ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీకి బాగా దెబ్బేసిందని కొందరు టీడీపీ నేతలు ఆందోళనపడిపోతున్నారు.టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీల అభ్యర్థులు రంగంలో ఉండడంతో చాల చోట్ల త్రిముఖ పోటీ నెలకొంది.
రామచంద్రాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తాను జనసేన వల్ల నష్టపోయానని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాడు.
అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని తుని, పెద్దాపురం, మండపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల్లో జనసేన దెబ్బకు టీడీపీ బాగా దెబ్బతిందట.
అలాగే పశ్చిమలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాల్లో కూడా జనసేన ఎఫెక్ట్ తో టీడీపీ నష్టపోయినట్టు టీడీపీకి అందిన రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది.