ఎన్నికలన్నాక ఒక పార్టీ మీద మరో పార్టీ విమర్శలు చేయడం మాములే.ఒక పార్టీకి చెందిన వారు ఇంకో పార్టీలో ఉన్న వారి మీద తిట్ల పురాణం మొదలుపెట్టడం సర్వ సాధారణమే.
కానీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న వారంతా ఎన్నికల అనంతరం మామూలుగానే మాట్లాడేసుకుంటూ ఉంటారు.అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అంటారు.
ఇక విషయానికి వస్తే సినిమా రంగానికి చెందిన వారంతా ఇప్పుడు ఎన్నికల్లో రకరకాల పార్టీలకు మద్దతు పలికి ఆయా పార్టీలకు ప్రజల్లో మంచి మైలేజ్ వచ్చేలా కృషి చేస్తున్నారు.అంతకుముందు వీరంతా కలిసి మెలిసి రకరకాల సినిమాల్లో నటించినా ఎన్నికల్లో మాత్రం బద్ద శత్రువులుగా మారిపోయారు.
ఎవరి పార్టీని వాళ్లు బుజానకెత్తుకుని రెచ్చిపోయారు.రేపొద్దుట మొహమొహాలు చూసుకోక తప్పదు అన్న నిజాన్ని మర్చిపోయి మరి తిట్ల దండకాన్ని మొదలుపెట్టారు.అందుకే సినిమా వాళ్లలో పార్టీల పరంగా వర్గాలు ఏర్పడిపోయాయి.ఎన్నికల సీజన్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ప్రవర్తించారు.
ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి.ఇప్పుడు వీరందరి పరిస్థితి ఏంటి ? మునుపటిలా అందరూ కలిసిపోయి సినిమాలు చేస్తారా లేక పార్టీల ప్రచారంలో తిట్టుకున్న విషయాలను మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తారు అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నాయకుడు ఆలీ సంగతే పరిగణలోకి తీసుకుంటే వీరిరువురు మంచి మిత్రులు అన్న సంగతి అందరికి తెలిసిందే.కానీ రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరూ బద్ద శత్రువులుగా మారిపోవడమే కాదు.ఒకరి మీద మరొకరు నిందలు వేసుకుని బజారున పడుతున్నారు.ఆలీని ఇకపై నమ్మే ప్రసక్తే లేదు అని పవన్ అంటే, నాకంటే నువ్వు జూనియర్ అంటూ అలీ ఎద్దేవా చేసినట్టు మరీ మాట్లాడాడు.
వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ కలసి పనిచేయగలరా ? ఒకరికొకరు ఎదురైతే ఇది వరకటిలా మనసు విప్పి మాట్లాడుకోగలరా ? అనేది అంతుపట్టడంలేదు.ఇక పవన్ అన్నయ్య నాగబాబు విషయానికి వస్తే ఆయన మీద నటుడు శివాజీ రాజా చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి.`
పిల్లికి కూడా బిచ్చం పెట్టవు.నరసాపురంకి నువ్వేం చేస్తావ్`అంటూ నాగబాబు మీద శివాజీ రాజా రెచ్చిపోయాడు.ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా వాళ్ళను సినిమా వాళ్లే బజారుకి ఈడ్చేశారని చెప్పుకొవచ్చు.ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అంతా రాజకీయ పగలు మర్చిపోయి ప్రశాంతంగా సినిమాల్లో కలిసి నటిస్తారో లేక అదే మనసులో పెట్టుకుని దూరం దూరంగా ఉంటారో చూడాలి.