ఏపీలో అధికార పార్టీ గా జనసేన జెండా ఎగురవేయాలనే ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కు, ప్రస్తుత రాజకీయాలు స్పష్టంగా అర్ధం కావడంలేదు.2019 ఎన్నికల్లో కనీసం 30 40 స్థానాలైన దక్కుతాయని, తాను చక్రం తిప్పవచ్చని ముందుగా అంచనా వేసినా, కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.రాజోలు నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ మాత్రమే గెలుపొందారు.ఒక్కడితోనే అసెంబ్లీలోనూ, బయట వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేయించి, జనసేన ఉనికిని మరింతగా చాటుకోవాలని పవన్ భావించినా, రాపాక వరప్రసాద్ మాత్రం పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం, అసలు జనసేనను పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ, అధికార పార్టీతో సన్నిహితంగా మెలుగుతుండడం వంటి పరిణామాలు చాలా రోజులుగా జరుగుతూనే ఉన్నాయి.
కొద్దిరోజుల క్రితం తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషినని, దీంట్లో ఎటువంటి మొహమాటం లేదంటూ రాపాక స్వయంగా ప్రకటించడంతో, రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.తనకు 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిత్వం దక్కకపోవడంతో, తన నియోజక వర్గ అభివృద్ధి దృష్ట్యా, తాను అధికార పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చారు రాపాక.అసలు జనసేనను ఉద్దేశించి ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు తాను చేయలేదని, అయినా తన పై సోషల్ మీడియాలో ఎదురుదాడి జరుగుతోందంటూ రాపాక చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా జనసేన గాలివాటం పార్టీ అని తాను అనలేదని, గాలివాటంగా తాను గెలిచాను అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అసలు తాను పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని పార్టీ అధిష్టానం భావిస్తే, తనను ఎందుకు సస్పెండ్ చేయకుండా, కాలయాపన చేస్తోంది అంటూ ప్రశ్నించారు.రాపాక వ్యాఖ్యలను బట్టి చూస్తే, జనసేన పార్టీ తనను సస్పెండ్ చేయడం లేదనే బాధ ఎక్కువగా ఉన్నట్టుగా అర్థమవుతుంది.
పార్టీ కనుక తన వ్యాఖ్యలకు నొచ్చుకుని సస్పెండ్ చేస్తే, నిరభ్యంతరంగా వేరే పార్టీలో చేరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
కానీ పవన్ మాత్రం ఈ విషయాన్ని ముందే గ్రహించి ఎటువంటి విమర్శలు చేసినా పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారు.పార్టీ నాయకులు కూడా ఈ వ్యవహారంలో మౌనంగా ఉంటున్నారు.కానీ సోషల్ మీడియాలో జనసైనికులు మాత్రమే రాపాక వరప్రసాద్ ను ట్రోల్ చేస్తున్నారు.