కాపులను బీసీల్లో చేర్చాలని అప్పటి టిడిపి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున పోరాటం, ఆందోళనలు నిర్వహించిన ముద్రగడ పద్మనాభం అప్పుడే వైసిపి అనుకూల వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు.జగన్ సహకారంతో ముద్రగడ కాపు రిజర్వేషన్ అంశాన్ని తెర పైకి తీసుకు వచ్చి, టిడిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించారనే విమర్శలు అప్పట్లో ముద్రగడపై వచ్చాయి.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా ముద్రగడ మాత్రం కాపులను బీసీల్లో చేర్చాలనే నినాదాన్ని వదిలిపెట్టకుండా టిడిపి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టారు.తుని లో కాపు ఉద్యమం సందర్భంగా రైలు దహనానికి పాల్పడడంతో ఈ ఉద్యమం కాస్త జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
ఇక అప్పటి నుంచి ముద్రగడ కాపు రిజర్వేషన్ అంశాన్ని ఉధృతంగా జనాల్లోకి తీసుకెళ్లారు.2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చారని, అది నిలబెట్టుకోవాల్సిందే అంటూ పోరాటాలు చేశారు.ఈ పోరాటాలతో టిడిపి 2019 ఎన్నికల్లో పూర్తిగా కాపుల మద్దతును కోల్పోయింది.ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
అంతేకాదు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటన చేశారు.ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి అంటూ ఆయనపై ఒత్తిడి వచ్చినా, వెనక్కి మాత్రం తగ్గలేదు.
ఇక ఆయన బిజెపి, వైసిపి, జనసేన పార్టీలలో ఏదో ఒక పార్టీ ని ఎంచుకుని ఆ పార్టీలో కీలకంగా మారుతారనే ఊహాగానాలు వచ్చినా ముద్రగడ మాత్రం మౌనంగా ఉండిపోయారు.ఇక ఆయన వ్యవహారం అందరూ మర్చిపోగా ఇప్పుడు మళ్ళీ లేఖలతో ముద్రగడ కాక రేపుతున్నారు.మాజీ కేంద్రమంత్రి టీడీపీ కీలక నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ముద్రగడ లేఖలు రాస్తున్నారు.అయితే ఇది వైసీపీకి కాస్త ఇబ్బందికరంగా మారడంతో ముద్రగడ తన స్టాండ్ మార్చుకున్నట్టు గా కనిపిస్తున్నారు.
జగన్ పై ఆగ్రహంగా ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.దీంతో మళ్లీ ఆయన కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.