నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గెలిచేందుకు అవకాశాలు పుష్కళంగానే కనిపిస్తున్నాయి.ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థలో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, దాంట్లో 70 శాతానికి పైగా టిఆర్ఎస్ కు చెందిన వారే ఉండడంతో మొదటి నుంచి ఈ సీటుపై ఆశాభావం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
అయితే మిగతా పార్టీలు కూడా ఇక్కడ గెలిచేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే పనిలో ఉండడంతో, టిఆర్ఎస్ మరింతగా అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరికలకు తెరతీశారు.
బీజేపీ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే నిజామాబాద్ నగరంలో కార్పొరేటర్లు టిఆర్ఎస్ లో చేరిపోతూ బీజేపీ కి అవకాశం లేకుండా చేస్తున్నారు.
మొత్తం 570 వరకు ఉన్న టిఆర్ఎస్ బలం చేరికలతో 645 కు చేరింది.
ఇప్పటికే బీజేపీ నుంచి ఎనిమిది మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరడంతో బీజేపీలో ఆందోళన మొదలైంది.గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఇక్కడ టీఆర్ఎస్ రాజకీయం మొదలు పెట్టింది.
బిజెపి కార్పొరేటర్లను టిఆర్ఎస్ లో చేర్చుకునే పనికి శ్రీకారం చుట్టారు.దీంతో పార్టీ నుంచి ఎవరూ వలసలు వెళ్లకుండా, అరవింద్ గట్టిగానే కష్టపడుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఈనెల తొమ్మిదో తేదీన ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో 90 శాతం మంది టిఆర్ఎస్ కు చెందిన వారే ఉండడంతో కవిత గెలుపు దాదాపు ఖాయమైపోయింది.అయినా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, టిఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు తెర తీసింది.అయితే ఇక్కడే అందరికీ ఓ అనుమానం మొదలైంది.ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కవిత టిఆర్ఎస్ మంత్రివర్గంలో చేరుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.ఎందుకంటే ఆరేళ్ల కాలపరిమితి గల ఈ ఎమ్మెల్సీ పదవి కాలం 2022 జనవరిలో ముగిసిపోతున్న నేపథ్యంలో కేవలం 15 నెలలు మాత్రమే ఎమ్మెల్సీగా కొనసాగాల్సి ఉంటుంది.ఎందుకంటే 2016 జనవరి 5 న ఈ స్థానం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఎమ్మెల్సీ గారు గెలిచారు.
ఆ తరువాత పరిణామాల్లో టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.దీంతో ఆయనపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయడంతో, ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.15 నెలల కాలపరిమితి ఉండడంతో కవితకు మంత్రి పదవి ఇస్తారా లేక ఎమ్మెల్సీ గానే పార్టీలో కీలక పదవి అప్పగిస్తారా అనే విషయంపైనే ఇప్పుడు టిఆర్ఎస్ లో జోరుగా చర్చ జరుగుతోంది.
జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించాలి అనుకుంటున్న కేసీఆర్ కవితకు పార్టీ పగ్గాలు అప్పగించి, కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది.
ఈ నేపథ్యంలో కవిత మంత్రి పదవి తీసుకుంటారా ? పార్టీ కీలక పదవుల్లో కూర్చుంటారా అనేది సందేహంగా మారింది.కేసీఆర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోందో ?
.