ఏపీ విషయంలో కేంద్రం చిన్న చూపు చూస్తోంది అనే బాధ ప్రతి ఒక్కరిలోనూ ఉంది .ఏపీకి అన్ని రంగాల్లోనూ అన్యాయమే జరుగుతోంది.
విభజన హామీలు, ప్రత్యేక హోదా, నిధుల విడుదల ఇలా అన్ని విషయాల్లోనూ కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నా ఏపీ అధికార పార్టీ వైసీపీ కానీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన కానీ, ఈ విషయంలో నోరుమెదపడం లేదు.దీనికి కారణం వైసీపీకి కేంద్రం అంటే భయం భక్తులు ఉండడమే.
టీడీపీకి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన.జనసేనకు బీజేపీతో పొత్తు ఉండడం.
ఇలా రకరకాల కారణాలతో కేంద్రంపై ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి.దీనిని అలుసుగా తీసుకుని కేంద్రం బీజేపీ ప్రభుత్వం తమ పని తాను చేసుకుంటూ పోతోంది.
హోదా అంశం పక్కన పెడితే ఇప్పుడు ఏపీకి ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తుంది.
ఈ విషయంలో ఏపీ లోని రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తూ కేంద్రం తీరు పై సుతిమెత్తగా విమర్శలు చేస్తున్నాయి తప్ప సీరియస్ గా యాక్షన్ లోకి దిగటం లేదు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తీరు పై రెండు లేఖలు రాశారు.తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని, నేరుగా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటాము అంటూ జగన్ లేఖ రాశారు.
కానీ ఈ లేఖలకు స్పందన రాలేదు.ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని బిజీగా ఉన్నారు.
మే రెండో తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి.ఆ తర్వాత మాత్రమే ఆయన అందుబాటులో ఉంటారు.
అయితే ప్రధాని జగన్ లేఖలకు స్పందించి అపాయింట్మెంట్ ఇస్తే, జగన్ నాయకత్వంలోని అఖిలపక్ష బృందం ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ఏపీ సమస్యలపై నిలదీస్తారా అనే చర్చ జరుగుతోంది.
జగన్ బృందంలో టీడీపీ, జనసేన నేతలు ప్రధాని దగ్గరికి వెళ్లి ఏపీకి జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తారా అనేది చర్చనీయాంశం అవుతోంది.తమ పంతాలు పట్టింపులు పక్కనపెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ముగ్గురు కలిసి కేంద్రాన్ని నిలదీసి ఏపీకి మేలు చేసే విధంగా వ్యవహరిస్తారా అనేది కూడా ఇక్కడ చర్చకు వస్తోంది.అలాకాకుండా ఎవరి వాదన వారిదే అన్నట్లుగా ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు జరుగుతున్న అన్యాయం పై నోరు మెదపకుండా ఉంటే, మరెన్నో రకాలుగా ఏపీ అన్యాయానికి గురికావాల్సిందే.