హుజురాబాద్ బై పోల్ను టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి అందరికీ అర్థమవుతున్నది.ఈ క్రమంలోనే ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజురాబాద్లో ‘దళిత బంధు’ను లాంచ్ చేయబోతున్నారు.
దళిత ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందుకు సంబంధించిన బహిరంగ సభ ఏర్పాట్లు గ్రాండ్గా జరుగుతున్నాయి.కాగా కేసీఆర్ పర్యటనతో హుజురాబాద్లో వార్ వన్ సైడ్ అవుతుందని, టీఆర్ఎస్ విక్టరీ డిక్లేర్ అవుతుందని గులాబీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీఆర్ఎస్ పార్టీ తరఫున వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు.
గెల్లు తరఫున మంత్రి హరీశ్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద యాత్ర పేరిట సభలు నిర్వహించి ప్రచారం నిర్వహించారు.
కేసీఆర్ పర్యటనతో హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాభవం పూర్తిగా తగ్గిపోతుందని అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి.దళిత బంధు సభతో సీఎం హుజురాబాద్ పొలిటికల్ గేమ్ను చేంజ్ చేస్తారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.ఇక దళిత బంధు స్కీమ్ కింద దళితులకు ఇంటికి రూ.10లక్షల చొప్పున అందజేయబోతున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ పథకం ప్రారంభోత్సవంలోనే ఎన్నికలకు సంబంధించిన శంఖారావాన్ని పింక్ పార్టీ ప్రారంభిస్తుందని భావించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.అయితే, ఈ సభలో సీఎం కేసీఆర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తావన తీసుకురాబోరనే తెలుస్తోంది.వ్యూహాత్మకంగానే విలక్షణ శైలిలో మాట్లాడే కేసీఆర్ ఈసారి బీజేపీపై విరుచుకుపడే చాన్సెస్ ఉన్నట్లు సమాచారం.సంక్షేమ సారథిగా టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన పథకాల పై పూర్తి స్థాయిలో స్పష్టమైన వివరణ ఇస్తారని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఫిజికల్గా ఎంట్రీ ఇచ్చి మరీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యవేక్షిస్తున్నారు.