అనుమానం పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది.భార్యపై అనుమానపడ్డ భర్త ఆమె విషయాలను అన్నిటినీ తెలుసుకునేందుకు యత్నించి పోలీసులకు చిక్కిపోయాడు.
వివరాల్లోకెళితే.కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన టి.నర్సింహాచలం- అనిత దంపతులు.కాగా, ఇటీవల కాలంలో అనితపై అనుమానం పెంచుకున్నాడు భర్త నర్సింహాచలం.
ఈ క్రమంలోనే భార్య అనిత ఏం చేస్తుందో తెలుసుకునేందుకుగాను ఆమెకు తెలియకుండా ఆమె ఫోన్లో ఓ సీక్రెట్ యాప్ ఇన్స్టాల్ చేశాడు.అలా సదరు యాప్తో భార్య ఏం చేస్తుందో ట్రేస్ చేయడం షురూ చేశాడు.
భార్య వాట్సాప్ చాటింగ్ చూడటం, ఆడియో రికార్డింగ్ చెక్ చేస్తున్నాడు.ఇవన్నీ ఆమెకు తెలియకుండానే చేస్తున్నాడు.
అయితే, ఇటీవల కాలంలో భార్య ఈ విషయాలను గుర్తించింది.వెంటనే పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
విచారణలో భర్త చేసిన నిర్వాకాన్ని వివరించారు పోలీసులు.ఇకపోతే కొన్నేళ్ల కిందట ఇంట్లోనుంచి పోయిన బంగారం విషయంలో ఆరా తీయడానికే తాను ఈ సీక్రెట్ యాప్ ఇన్ స్టాల్ చేసినట్లు నిందితుడు నర్సింహాచలం చెప్పాడు.
ఇదే పద్ధతిలో మరో ఇద్దరు బంధువుల ఫోన్లలోనూ సీక్రెట్ యాప్ను వారికి తెలీకుండా ఇన్ స్టాల్ చేసినట్లు విచారణలో పేర్కొన్నాడు.అయితే, బంధువుల ఫోన్లలో ఎందుకు యాప్ ఇన్ స్టాల్ చేశాడన్న విషయం ఇంకా తెలియరాలేదు.
ఈ విషయమై పోలీసులు విచారిస్తున్నారు.కాగా, ఇటీవల కాలంలో అనుమానం పెనుభూతంగా మారిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి.భార్యా భర్తల విషయంలో ఇటువంటి కేసులు కూడా చాలానే వస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు.ఈ నేపథ్యంలో భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండేందుకుగాను ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలని, సమస్యలు ఏవైనా డీటెయిల్డ్ డైలాగ్తో పరిష్కరించుకోవాలని, అవసరం అయితే, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఎక్స్పర్ట్స్ వద్దకు వెళ్లాలని పలువురు సూచిస్తున్నారు.