సాధారణంగా పెళ్లికాకముందు అబ్బాయి తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిను ఎంతో ప్రేమగా చూసుకుంటానని, నీకు నచ్చినట్లే ప్రవర్తిస్తానని, నీకు నచ్చిన విధంగానే నడుచుకో అంటూ ఎన్నో మాటలు చెబుతుంటారు.కానీ ఒక్కసారి మూడు ముళ్ళు పడిన తర్వాత అత్తవారింట్లో అమ్మాయి అన్ని కట్టుబాట్లకు లొంగి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి.
కొంతమంది ఈ కట్టుబాట్లకు సర్దుకొని జీవనం సాగిస్తుంటారు.మరికొందరు మాత్రం తమ వివాహ బంధం నుంచి విడిపోయిన సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి.
అచ్చం ఇలాంటి తరహాలోనే పెళ్లికి ముందు తన భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదంటూ ఓ అమ్మాయి ఏకంగా పోలీసులను ఆశ్రయించిన ఘటన అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది.
అహ్మదాబాద్ లోని సర్ఖేజ్ ప్రాంతంలో జుపుహారాకు చెందిన ఓ 37 ఏళ్ల మహిళకు 2017 సంవత్సరంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది.
అయితే ఈ పెళ్లి ఆ వ్యక్తికి మూడో పెళ్లి కాగా, మహిళకు రెండో పెళ్లి.పెళ్లికి ముందు ఆ వ్యక్తి తను జాబ్ చేయొచ్చని, ఇద్దరూ కలిసి వేరే కాపురం పెడదామని, తనకు నచ్చినట్లుగా ఉండవచ్చని మాట ఇచ్చాడు.
కానీ పెళ్లయిన తర్వాత తన జాబ్ చేయకూడదని, ఇంట్లో పద్ధతి గల దుస్తులు ధరించాలి, జీన్స్ వేసుకోకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఏ ఫంక్షన్ లకు వెళ్ళకూడదు అనే కండిషన్ పెట్టాడు.అంతేకాకుండా మహిళ తండ్రి ఇచ్చిన ఫ్లాట్ లో వేరే కాపురం ఉండటానికి కూడా ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో ఎంతో నిరాశ చెందిన ఆ మహిళ ఏకంగా ఆ వ్యక్తి పై పోలీస్ కేసు నమోదు చేసింది.
తన భర్త మాట తప్పడంతో తీవ్ర నిరాశకు గురైన ఆ మహిళ సర్ఖేజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ఆ ఫిర్యాదులో తన అత్తమామల వేధింపులకు గురయ్యానని, తనకు పిల్లలు పుట్టకపోవడానికి నేనే కారణం అంటూ అత్తమామలు వేధించసాగారని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.దీంతో ఎంతో విసుగుచెందిన ఆ మహిళ తన అత్తమామలు, భర్త పై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.