సమాజానికి సేవ చేయాలనే తపన మనస్సులో ఉంటే చాలు.ఎవరైనా ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ పేదలకు సేవ చేయవచ్చు.
అందుకు ఏవీ అడ్డుకావు.పేదలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉంటే ఎవరైనా ఆ పని చేయగలుగుతారు.
అందుకు వారి స్థాయి కూడా అడ్డు కాదు.సరిగ్గా ఇదే సూత్రాన్ని అక్షరాలా పాటిస్తుంది ఆ ఐఏఎస్ అధికారి భార్య.
భర్త ఓ జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తుంటే ఆమె మరో వైపు అదే జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతోంది.
ఆయన పేరు మంగేష్ ఘిల్దయాల్.2011 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వారు.అప్పట్లోనే ఆయన సివిల్ సర్వీస్ ప్రవేశ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకును సాధించారు.
దీంతో ఐఎఫ్ఎస్లో చేరేందుకు చాన్స్ లభించింది.అయినప్పటికీ ఆయన ఐఏఎస్నే ఎంచుకున్నారు.
సమాజానికి సేవ చేయాలనే తలంపు మెండుగా ఉంది కాబట్టే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.ఇక ఐఏఎస్ అయి కలెక్టర్గా ఆయన మొదటిసారి ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ అనే జిల్లాకు వెళ్లి బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలోనే ఆయన ఉష అనే యువతిని వివాహం చేసుకున్నారు.అయితే భర్త మంగేష్కు తోడుగా ఉష కూడా సమాజ సేవ చేసేది.
కలెక్టర్గా ఆయన పేదలను కలిసేందుకు వెళ్తే ఆయనతో వెళ్లి వారి బాగోగులు అడిగి తెలుసుకునేది.దీంతో ఆ జిల్లాలో చాలా మంది హృదయాల్లో వీరు స్థానం సంపాదించారు.
ఈ క్రమంలో ఆయనకు రుద్రప్రయాగ్ కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయింది.దీంతో ఆయనకు వెళ్లక తప్పలేదు.
అయితే అలా మంగేష్ ట్రాన్స్ఫర్పై వెళ్లేటప్పుడు చాలా మంది ఆయనను బదిలీ చేయవద్దని కోరారు.అదీ… వారు తమ గుండెల్లో ఆయన పట్ల పెంచుకున్న స్థానానికి నిదర్శనం.
ఇక కొత్తగా బాధ్యతలు చేపట్టిన రుద్ర ప్రయాగ్లోనూ కలెక్టర్ మంగేష్ అనేక కార్యక్రమాలు చేపట్టారు.పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.దీంతో ఆయనకు ఆ జిల్లాలోనూ అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించింది.అయితే రుద్రప్రయాగ్లో ఉన్న రాజ్కియా గర్ల్స్ ఇంటర్ కాలేజీ అనే ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ల కొరత ఉండడాన్ని మంగేష్ గమనించారు.
దీంతో తన భార్య ఉషను ఆ కాలేజీలో పాఠాలు చెప్పాల్సిందిగా కోరాడు.దీనికి ఆమె కూడా అంగీకరించి ఆ కాలేజీలో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతోంది.స్వతహాగా పీహెచ్డీ చదివిన ఉషకు ఆ కాలేజీలో పాఠాలు చెప్పడం పెద్దగా ఇబ్బంది కాలేదు.ఇక ఇప్పుడు మీరే చెప్పండి, సమాజానికి సేవ చేస్తున్న ఆ కలెక్టర్, ఆయన భార్యను ఏమని అభినందించాలో.! ఇలాంటి వారినే కదా ప్రజలు అధికారులుగా రావాలని కోరుకునేది.!
.