మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని ప్రజలను చైతన్య పరచడానికి ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.కొన్ని ప్రభుత్వాలు అయితే ఏకంగా, మద్యం రేట్లను భారీగా పెంచేశాయి.
అయినా కొందరు మాత్రం మద్యానికి బానిసై ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.ఇలా ప్రవర్తించడం వల్ల ఓ వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాల నుంచి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు.అనిల్ కుమార్ భార్య పికాదేవి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
అనిల్ కుమార్ ప్రతిరోజు పని ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి బాగా మద్యం సేవించి ప్రతిరోజు భార్యాబిడ్డలతో గొడవ పడేవాడు.అలాగే గురువారం రాత్రి కూడా బాగా మందు తాగి తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు.
ఓపిక నశించిన ఆ భార్య చేసేదేమీలేక అనిల్ కుమార్ గొంతు కోసింది.ఈ ఘటనలో అనిల్ కుమార్ మృతి చెందాడు. మృతి చెందిన అనిల్ కుమార్ ను తన కూతురుల సహాయంతో అదే ప్రాంతంలో ఉన్న పార్కులో పడేసారు.శుక్రవారం ఉదయం శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అనిల్ మృతదేహాన్ని పరిశీలించారు.
మద్యం ఎక్కువగా తాగడం వల్లే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చి, ఈ కేసును దర్యాప్తు చేశారు. పోలీస్ కేసు దర్యాప్తులో భాగంగా తర్వాత అతని భార్య, పిల్లలు కలిసి అనిల్ కుమార్ ను గొంతుకోసి చంపినట్లు తెలిపారు.
ప్రతిరోజు మద్యం తాగి, గొడవ పడటం భరించలేకే అతనిని చంపినట్లు అనిల్ కుమార్ భార్య నిజం ఒప్పుకోవడం తో పోలీసులు తనతో పాటు ఇద్దరు కూతుర్లను అరెస్టు చేశారు.తన కూతుర్లు మైనర్ కావడంతో వారిని జువైనల్ హోమ్ కి తరలించినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు.