రాజకీయంగా ఏపీలో అనేక సంచలనాలు జరిగిపోతున్నాయి.అధికార పార్టీ మీద తెలుగుదేశం ఒక వైపు, బీజేపీ ఒకవైపు, జనసేన ఇంకోవైపు న పోరాటం చేస్తూ ఎక్కడలేని హడావుడి చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల కాలంలో ఎన్నో అక్రమాలు జరిగిపోయాయని, పరిపాలన కుంటిపడిపోయిందని ఇలా ఎవరికి వారు హంగామా చేస్తున్నారు.అయినా అధికార పార్టీ నుంచి పెద్దగా స్పందన రావడం లేదు.
ముఖ్యంగా సీఎం జగన్ విపక్షాల విమర్శలకు తన మౌనమే సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.అయితే దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ మాత్రం తన పని తనదే అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నాడు.
ఇప్పటి వరకు విపక్షాలు చేసిన ఏ విమర్శలకు జగన్ సమాధానం ఇవ్వలేదు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పల్నాడులో వేధింపులు పెరిగిపోయాయని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని వారిపై దాడులు చేస్తూ, కేసులు పెడుతూ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ గట్టిగానే విమర్శలు చేశారు.
ఇటీవల నిర్వహించిన ఛలో ఆత్మకూరు అనే కార్యక్రమం నిర్వహించి పార్టీపరంగా టీడీపీ మైలేజ్ పెంచుకుంది.దీనిపైన జగన్ స్పందించలేదు.ఇక గోదావరి నదిలో చోటు చేసుకున్న బోటు ప్రమాదం పై రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ సైలెంట్ గానే ఉన్నారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీని చేపట్టింది.
దీంట్లో గ్రామ సచివాలయం ఉద్యోగాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పరీక్షలు నిర్వహించడంతో పాటు, అతి తక్కువ సమయంలోనే ఫలితాలు కూడా విడుదల చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు.కానీ ఈ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని, పరీక్ష పత్రం లీక్ అయిందని ఎక్కువ శాతం ఉద్యోగాలు వైసిపి మద్దతుదారులకు వచ్చాయని టిడిపి ఆ పార్టీకి అనుకూల మీడియా జనాల్లోకి తీసుకు వెళ్ళింది.
దీనిపై ప్రజల్లో కూడా అనుమానాలు పెరిగిపోయాయి.స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు.కానీ దీనిపై జగన్ స్పందించి క్లారిటీ ఇచ్చి ఉంటే వ్యవహారం ఇంత వరకు వచ్చేది కాదు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా సంక్షేమ పథకాలు చేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేసినా ఆశించిన స్థాయిలో మైలేజ్ రాకపోవడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది.ఇలా చెప్పుకుంటూ వెళితే ఏ విషయంలోనూ ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకునే ముందుకు వెళుతోంది.ముందు ముందు కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తూ జగన్ ప్రభుత్వం ముందుకు వెళితే ఇబ్బందులు తప్పవన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఏదైనా ప్రభుత్వం మీద బలమైన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ మౌనం వీడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.