ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కాలంటే కుల మద్దతు చాలా అవసరమని పవన్ గ్రహించేసాడు.అందుకే మళ్ళీ కులం అనే తుట్టెను కదుపుతున్నాడు.
తమ కుటుంబ గత చరిత్ర అంతా చెప్పుకొచ్చేసాడు.అంతే కాదు కాపు సామాజిక వర్గం ప్రధానంగా డిమాండ్ చేస్తున్న రిజర్వేషన్ అంశం పై పవన్ కళ్యాణ్ స్పష్టత కొచ్చేశారు.
తమ పార్టీ కి ప్రధానంగా వున్న బలాన్ని ఆయన మరింత పెంచుకోవాలంటే కాపు రిజర్వేషన్ లపై క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
గత కొంత కాలంగా ఇతర కులాల మద్దతు కోసం సొంత సామాజిక వర్గాన్ని దూరం పెడుతూ వచ్చిన ఇప్పుడు మాత్రం వారికి ఉత్సాహం ఇచ్చేలా మాట్లాడారు.కాపులు తన చిన్ననాటినుంచి వెనుకబడే వున్నారని తన బంధువుల్లో చాలామంది అత్యంత పేదరికంలో వున్నవారు ఉన్నారని చెప్పుకొచ్చారు.తమ కుటుంబం పేదరికం నుంచి వచ్చిందని గుర్తు చేశారు.
తమ ముత్తాత రాజోలు దగ్గర చిన్న గ్రామంలో వ్యవసాయం చేస్తూ మునసబు గా పనిచేశారని, తాత పోస్ట్ మెన్ గా తండ్రి కానిస్టేబుల్ గా పనిచేస్తే నాయనమ్మ ఉత్తరాంధ్ర వారని తాము బలిజలు ప్లస్ తూర్పు కాపుల మూలాలు గలవారమని తన తాతతండ్రుల చరిత్ర చెప్పుకొచ్చారు.స్వాతంత్య్రానికి పూర్వం కాపులకు రిజర్వేషన్లు ఉండేవని గుర్తు చేశారు.
కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చడానికి రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ సవరించాలిసి ఉంటుంది.కేంద్రం పరిధి లోని ఈ అంశం పై రాష్ట్ర పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఆ తరువాత అమలు చేయలేక పోతున్నాయి.టిడిపి సైతం గత ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చి అసెంబ్లీ తీర్మానం చేసి మా పని అయిపోయిందని తేల్చేసింది.ఇవన్నీ పరిశీలించిన పవన్ అనేక కీలక ముడులు పడి వున్న ఈ అంశం తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ చిక్కుముడులన్నీ విప్పుతామని చెప్పి ఆ సామజిక వర్గంలో ఉత్సాహం నింపారు.