2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారం దక్కించుకోవడమే ఏకైకా లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నాడు.జనసేనకు ఏపీలో భారీగా అభిమానులు, ఓ ప్రధాన సామాజికవర్గం అండ పుష్కలంగా ఉన్నా 2019 ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందామనే సమీక్ష చేసుకున్న పవన్ ఇకపై ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలని చూస్తున్నాడు.
అందుకే క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా కమిటీలను పవన్ ఏర్పాటు చేశారు.అయితే ఆ కమిటీల్లో ప్రజా బలం ఉన్న నాయకులకు పెద్దగా అవకాశం దక్కకపోవడం పై విమర్శలు మొదలయ్యాయి.
ముఖ్యంగా చెప్పుకుంటే ఈ కమిటీలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేరు కనిపించకపోవడంపై అప్పుడే అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.
జనసేనపైనా, పవన్ పైనా లక్ష్మీనారాయణ గుర్రుగా ఉన్నారని ఆయన జనసేనను వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.జనసేన అభ్యర్థిగా ఆయన విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిచెందారు.ఇక అప్పటి నుంచి ఆయన జనసేనకు కాస్త దూరంగానే ఉంటున్నారు.
వాస్తవంగా చెప్పుకోవాలంటే పార్టీలో నాదెండ్ల మనోహర్ చేరిన దగ్గర నుంచి జేడీని పెద్దగా పట్టించుకోనట్టే కనిపించారు.పార్టీ ఓటమిపై నిర్వహించిన సమీక్షా సమావేశాలకు కూడా జేడీ హాజరుకావడం మానేశారు.
దీంతో ఆయన జనసేనకు దూరమవుతారనే ప్రచారం పార్టీలో మొదలయ్యింది.దానికి బలం చేకూరుస్తూ జనసేన ఏర్పాటు చేసిన పార్టీ పోలిట్ బ్యూరోలో లక్ష్మీనారాయణకు చోటు దక్కలేదు.
పొలిట్ బ్యూరోతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీలో కూడా ఆయనకు స్థానం దక్కలేదు.
కానీ ఆ కమిటీల్లో నాదెండ్ల మనోహర్, నాగబాబులకు పదవులు దక్కాయి.ఈ పరిణామాలన్నిటిని అంచనా వేస్తే లక్ష్మీ నారాయణకు పార్టీ నుంచి అంత ప్రాధాన్యత ఉన్నట్టు కనిపించలేదు.దీంతో ఆయనకు జనసేనతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయనే ప్రచారం మొదలయ్యింది.
సీబీఐ అధికారిగా పనిచేసిన లక్ష్మి నారాయణ నిజాయితీ కలిగిన అధికారిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పార్టీ కి బాగా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ అయినా ఆయన్ను పవన్ నిర్లక్ష్యం చేయడం పవన్ కు ఇబ్బందికరమే.
అత్యంత కీలకమైన లక్ష్మీనారాయణను పోలిట్ బ్యూరోలో నియమించకపోవడం పై జనసేనాని మీద విమర్శలు మొదలయ్యాయి.అయితే లక్ష్మి నారాయణ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.