బజరంగ్ దళ్ గురించి దేశ ప్రజలందరికీ తెలుసు.ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థల్లో ఒకటైన బజరంగ్ దళ్ను హిందూత్వ సంస్థల్లో తీవ్రవాద సంస్థగా చెప్పుకోచ్చు.
దేశంలో ఎక్కడ హిందూ-ముస్లిం ఘర్షణలు జరిగినా బజరంగ్ దళ్ పేరు తప్పకుండా వినబడుతుంది.ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని హిందువుల గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నది.ఎందుకు? తాజాగా కేంద్ర ప్రభుత్వం మతాల వారీగా జనగణన లెక్కలను విడుదల చేసిన సంగతి తెలుసు.ఈ లెక్కలు దేశంలో హిందువుల జనాభా తుగ్గుతోందని, ముస్లింల జనాభా పెరుగుతోందని తెలియచేశాయి.
ఒక హిందూత్వ సంస్థకు హిందువుల జనాభా తగ్గితే ఆందోళన కలగడం సహజమే కదా….! హిందువులకు కొమ్ముకాసే మరో పార్టీ శివసేన కూడా హిందువుల జనాభా తగ్గడంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది.
ఉద్దేశపూర్వకంగానే ముస్లింల జనాభా పెంచి చూపించారని, ఇది ‘మత రాజకీయం’ అని శివసేన విమర్శించింది.ప్రస్తుతానికి వస్తే హిందువుల జనాభా తగ్గడంపై ఆందోళన చెందుతున్న బజరంగ్ దళ్ దీనిపై హిందువుల్లో అవగాహన పెంచే కార్యక్రమం చేపట్టింది.
జనాభాలో హిందువుల సంఖ్య ఎందుకు తగ్గుతున్నదో వివరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ప్రస్తుతం ఈ కార్యక్రమం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి ప్రారంభమైంది.
ముస్లింల జనాభా పెరగడానికి కారణం వారు సంతాన పరిమితిని పాటించకపోవడమేనని హిందూ నాయకుల అభిప్రాయం.అందుకే హిందువులు ఎందుకు ‘మేమిద్దరం…మాకిద్దరు’ అనే విధానాన్ని అవలంబిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.ఈ విధానం పాటిస్తే హిందువులు క్రమంగా తగ్గిపోతారని బజరంగ్ దళ్ నాయకులు అన్నారు.దేశంలో దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నా, దానిపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నా దేశ జనాభా పెరుగుతూనే ఉంది.
అందులోనూ ముస్లిం జనాభా పెరుగుతోంది.ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించడంలేదనే విమర్శలున్నా అది పూర్తిగా నిజమని చెప్పలేం.
విద్యావంతులైన, సంపన్నులైన ముస్లిములు కుటుంబ నియంత్రణ పాటిస్తూనే ఉన్నారు.కాని అక్షరాస్యత లేని, మత భావాలు తీవ్రంగా ఉన్న ముస్లిములు కుటుంబ నియంత్రణ పాటించకపోవచ్చు.
అయితే చుట్టుపక్కల దేశాల నుంచి ఇండియాలోకి చొరబాట్లు ఎక్కువగా ఉండటం కూడా ముస్లింల జనాభా పెరుగుదలకు కారణం కావొచ్చు.ముస్లిం పెరుగుదల లెక్కల వెనుక రాజకీయం ఉంటే అది భాజపాకు ఎలా ప్లస్ అవుతుందో చూడాలి.