ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా పాదయాత్ర చేస్తున్న వ్యక్తిగా నారా లోకేష్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడదల రజిని మాట్లాడారు.
నారా లోకేష్ పాదయాత్ర ఎందుకో.ఆ యాత్ర లక్ష్యం ఏమిటో ఆయనకే తెలియనట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న హయాంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు.లోకేష్ తన పాదయాత్రలో అమ్మ ఒడి పథకం అవసరం లేదని చెప్పగలరా అని ప్రశ్నించారు.
రైతు భరోసా పథకం, వైఎస్పార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, ఆరోగ్యశ్రీ పథకాలేవీ ఈ రాష్ట్ర ప్రజలకు వద్దని పాదయాత్రలో చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, ఆస్పత్రులను అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని పాదయాత్రలో లోకేష్ చెబుతాడా అని డిమాండ్ చేశారు.
పాదయాత్రలో లోకేష్ వారి సీఎం అభ్యర్థి ఎవరో కనీసం చెప్పగలడా అని ప్రశ్నించారు.తానే సీఎం అని చెప్పగలిగే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.
పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అని చెప్పగలడా .పోనీ చంద్రబాబునాయుడు సీఎం అభ్యర్థి… అనైనా చెప్పగలడా అని ప్రశ్నించారు.తెలుగుదేశంపార్టీ, పవన్ కల్యాణ్ విడివిడిగా పోటీ చేస్తాం అనైనా చెప్పగలరా అని డిమాండ్ చేశారు.ఏ విషయంలోనూ స్పష్టత లేని లోకేష్ పాదయాత్రలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
అందుకే ఆ పాదయాత్ర పేరు యువగళం కాదు… గందరగోళం అని ఎద్దేవా చేశారు.