కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.ఒకవైపు ఎన్నికల వేడి ఏపీలో భగ భగ మండుతూ ఉంటే ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు.
అసలు ఆయన సైలెన్స్ వెనుక ఉన్న వైలెన్స్ ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావడంలేదు.ప్రస్తుతం కాపు రిజర్వేషన్ల అంశంపై తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది.
మోడీ ఇటీవల చట్టం గా మార్చిన ‘అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్’ ని ఆధారంగా చేసుకుని, ఆ 10% లో ఐదు శాతాన్ని కాపులకు కేటాయిస్తానని, మిగిలిన ఐదు శాతం రిజర్వేషన్లను అగ్రవర్ణాల లోని ఇతర పేదలందరికీ వర్తించేలా చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.
అయితే ఈ కాపు రిజర్వేషన్స్ అంశంపై పోరాడిన ముద్రగడ పద్మనాభం మాత్రం ఈ విషయంలో … తన అభినందనలు… అభ్యంతరాలు ఏవీ తెలియజేయకపోవడం అనేక సందేహాలను కలిగిస్తున్నాయి.అయితే పద్మనాభం మౌనం వెనుక ‘రాజకీయ కోణం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతకు ముందు రెండు ఎన్నికల్లో ముద్రగడ పిఠాపురం, ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానాల నుంచి వరుసగా ఓటమి పాలయ్యారు.
అయినప్పటికీ కాపు ఉద్యమంతో ఆయన నిత్యం వార్తల్లో నేతగా నిలిచారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఇప్పటికే రాజకీయంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్న ఆయన .జనవరి 31న కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.కత్తిపూడి కేంద్రంగా నిర్వహించబోయే ఈ సమావేశంలో .కీలక రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారని కాపు జేఏసీ నేతలు చెబుతున్నారు.అయితే ముద్రగడ కి టీడీపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని… ఆ చర్చల కారణంగానే, ముద్రగడ పద్మనాభం ప్రస్తుతానికి స్పందించడం లేదని, చర్చలు పూర్తయ్యాక అవి సఫలం కావడం లేదా విఫలం కావడం అన్న అంశాన్ని బట్టి చంద్రబాబు తీసుకున్న రిజర్వేషన్స్ అంశంపై స్పందించాలని ముద్రగడ ఆలోచనగా ఆయన అనుచరులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు చూస్తే… ఆయన వైసీపీతో చేతులు కలిపి ఏపీ రాజకీయాల్లో సొంత సామాజిక వర్గం దన్నుతో చక్రం తిప్పాలనే ప్రయత్నానికి ముద్రగడ వచ్చినట్టు కూడా కధనాలు ప్రచారంలోకి వచ్చాయి.దీనిలో భాగంగా ఆయన పిఠాపురం నుంచి మరోసారి పోటీ చేయాలని చూస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చూస్తున్నాడు.
అదే ఖాయం అయితే ఈ ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది.అయితే ఈ వార్తల సంగతి కాసేపు పక్కనపెడితే …ఈనెలాఖరులో ముద్రగడ తీసుకోబోయే నిర్ణయం ఏపీ రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.