ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సీరియస్ గా రాజకీయ కామెంట్లు చేసినా, ఆయన కామెంట్లకు పెద్దగా ప్రాధాన్యం అయితే లభించదు.ఆయన కామెంట్లను, ఆయన సూచనలను ఎవరు సీరియస్ గా అయితే తీసుకోరు.
ఏపీతో పాటు, తెలంగాణ రాజకీయాల్లోనూ ఆయన ఈ మధ్యకాలంలో హడావుడి చేస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున రెండు రాష్ట్రాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టి సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలం, బలగం లేకపోవడంతో పాల్ ఆశలైతే తీరేలా కనిపించడం లేదు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకున్న వ్యవహారాలపై కేఏ పాల్ గత కొద్ది రోజులుగా స్పందిస్తున్నారు.
ముఖ్యంగా కందుకూరు, గుంటూరు జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాట లో అనేకమంది ప్రాణాలు కోల్పోవడంతో, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎవరు రోడ్లపై ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టకుండా , ఏదైనా ఖాళీ ప్రదేశాల్లో ఈ బహిరంగ సభలను నిర్వహించుకోవాలని సూచించింది.
దీనిపై ఏపీలోని విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తుండగా, కేఏ పాల్ మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశంసిస్తున్నారు.తాజాగా చంద్రబాబు కుప్పం టూర్ ను పోలీసులు అడ్డుకోవడం వంటి విషయాలపై పాల్ స్పందించారు.
గుంటూరు, కందుకూరు ఘటనలో మరణాలకు చంద్రబాబు కారణమయ్యారని , వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని పాల్ డిమాండ్ చేస్తున్నారు.కుప్పం లో ప్రభుత్వ ఆంక్షలు ఉల్లంఘించి చంద్రబాబు రోడ్ షో చేపట్టేందుకు ప్రయత్నించిన తరువత తలెత్తిన గందరగోళం వంటి విషయాలపై స్పందించారు.
కుప్పం పోలీసులు తెలివైన పని చేశారని, టిడిపి క్యాడర్ , చంద్రబాబును అడ్డుకోవడం సరైనదేనని, అయితే చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ పోలీసులను ప్రశ్నించారు.
బాబు తో పోలీసులు చర్చలు జరగకూడదని , చంద్రబాబు రోడ్ షోలను చేపట్టకుండా పోలీసులు ముందుగా అడ్డుకోవాలని సూచించారు.తాజాగా పాల్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి అసలు పాల్ కు ఏ విషయంలో చంద్రబాబు అన్యాయం చేశారని ? ఆయనపై ఎందుకు ఇంతగా ఆయన ఆవేశపడుతున్నారంటూ మండిపడుతున్నారు.కానీ పాల్ మాత్రం సందర్భం వచ్చిన ప్రతిసారి, చంద్రబాబు పై విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు.