కొద్ది రోజులుగా తెలంగాణ , ఏపీ రాజకీయాల్లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది.ఆయన బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిత్యం , ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటూ వస్తున్నారు.
అలాగే అధికార పార్టీ టిఆర్ఎస్ పై ఏదో ఒక అంశంపై విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు.బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు హవా పెరిగిన తర్వాత, టిఆర్ఎస్ గ్రాఫ్ తెలంగాణలో తగ్గుతూ వస్తుందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం తన శైలిని మార్చుకుని మరి ప్రజాక్షేత్రంలో తిరుగుతూ, ప్రజల బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.సంక్షేమ పథకాలను అలాగే ప్రభుత్వ ఉద్యోగులలో టీఆర్ఎస్ పై ఆదరణ పెంచే విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
ఇదంతా తెలంగాణలో బిజెపి స్పీడ్ పెరగడం కారణంగానే కనిపిస్తోంది.
అలాగే ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధించగలిగింది .నాగార్జునసాగర్ , వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బిజెపి గట్టి ప్రయత్నాలే చేస్తోంది.అందుకే ముందుగానే బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టాలని డిసైడ్ అయిపోయారు.దీనికి బీజేపీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు పాదయాత్ర చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు .దీనికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.సుమారు ఎనిమిది నెలలో 2500 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాలనే లక్ష్యంతో సంజయ్ ఉన్నారు.
అయితే ఏ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టాలనే విషయం పై ఇంకా క్లారిటీకి రాలేనట్లు తెలుస్తోంది.గతం నుంచి చూసుకుంటే పాదయాత్ర చేపట్టిన ప్రతి పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో, సంజయ్ కూడా ఈ రూట్ నే ఎంచుకున్నట్టు గా కనిపిస్తున్నారు.
ఈ పాదయాత్రలో పూర్తిగా టిఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపడం తో పాటు, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తాము ? టీఆర్ఎస్ కంటే భిన్నమైన పరిపాలన ఏవిధంగా అందిస్తామనే విషయం పై ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి , బలమైన పునాదులు వేసుకునే ఆలోచనతో బండి సంజయ్ ఉన్నట్లు కనిపిస్తున్నారు.పాదయాత్రలో మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.