సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు.
నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
గురువారం ఆయన అంతక్రియలు ముగిసాయి.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్తో హరికృష్ణకు ఎంతో అనుబంధం ఉంది.దీంతో ఆయన పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి, నివాళులు అర్పించాలని టీడీపీ నేతలు భావించారు.అయితే… అంతకుముందే నార్కెట్పల్లి ఆస్పత్రి నుంచి భౌతిక కాయాన్ని హరికృష్ణ నివాసానికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో ఇంటి నుంచి నేరుగా మహా ప్రస్థానానికే వెళ్లాలని, మధ్యలో ఎక్కడైనా ఆపితే, మళ్లీ ఇంటికి తీసుకొచ్చి స్నానాదికాలు చేయాలని పండితులు స్పష్టం చేశారు.పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి మళ్లీ వెనక్కు ఇంటికి తీసుకువెళ్లడం సరికాదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
ఇదే విషయాన్ని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారు.
ఇక… అంతిమయాత్ర ప్రారంభం అయ్యే సమయంలో హరికృష్ణ కుటుంబ సభ్యులను చంద్రబాబు పిలిచి మాట్లాడారు.టీడీపీ పొలిట్బ్యూరో సభ్యునిగా ఉన్న హరికృష్ణ దేహంపై పార్టీ పతాకం కప్పుతామని, వారికి అభ్యంతరం లేకపోతే ఆ పని చేస్తామని చెప్పారు.వారు అంగీకరించడంతో ఆయన పార్టీ పతాకం కప్పారు.
గురువారం రాత్రికి ఆయన విజయవాడకు తిరిగి వచ్చారు.మంత్రులు, పార్టీ సీనియర్లు, రెండు రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ రెండు రోజులూ అక్కడే ఉండిపోయారు.