ఏపీ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా నడుస్తోంది.సీఎం జగన్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా ప్రతిపక్షాలు మాత్రం అదిగో ముందస్తు… ఇదిగో ముందస్తు ఎన్నికలు అంటూ ఊదరగొట్టేస్తున్నాయి.
అంతేకాదు బరిలోకి దూకేందుకు రెడీగా ఉండాలని కేడర్ను కూడా సిద్ధం చేసేస్తున్నాయి.ఈ ముందస్తు స్టేట్మెంట్లు… వాటికి అధికారపక్షం కౌంటర్లు ఇవ్వడం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
అయితే వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు కోరుకుంటుందా అంటూ ఆ పార్టీ నేతలే డైలమాలో పడ్డారు.ఎందుకంటే ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
అలాంటప్పుడు ముందస్తుకు వెళ్లేందుకు ఎందుకు సాహసం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలు రావని రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
జగన్ తన పాలనలో ఫెయిల్ అయితే అసలు ముందస్తు ఎన్నికలు ఎలా వస్తాయో తమకు అర్ధం కావడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.ఏపీ అప్పుల్లో ఉంటే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చంద్రబాబు చెబుతున్న దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా అని పలువురు నిలదీస్తున్నారు.
అయితే చంద్రబాబు ఓ స్ట్రాటజీ ప్రకారమే ముందస్తు ఎన్నికలపై ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నారు.ఎన్నికలు అనగానే అధికార పార్టీలో అసంతృప్తులు తట్టా బుట్టా సర్దుకుని తమ పార్టీలోకి వచ్చేస్తారని బాబు వేసిన ఎత్తుగడగా దీనిని కొందరు వర్ణిస్తున్నారు.
అయితే వైసీపీ చేస్తున్న కొన్ని పనులు కూడా ముందస్తు ఎన్నికలపై అనుమానాలను కలిగిస్తున్నాయి.ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ఊరూరా, గడప గడపకు వెళ్తోంది.ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడే బాదుడు పేరుతో ప్రతి గడపలో తిరుగుతోంది.అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరామర్శ, ఆర్థిక సహాయం అందజేసేందుకు జిల్లాల్లో తిరుగుతున్నారు.
బీజేపీ కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన కార్యక్రమంతో ముందుకు సాగుతోంది.అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎంతలా ఉన్నా కూడా టీడీపీ 40 శాతం ఓటు షేర్ సాధించింది.
అలాంటి పార్టీ ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అంటూ పొత్తుల కోసం తహతహలాడుతోంది.అంటే తమ పార్టీ డ్యామేజ్ అయిందని టీడీపీ ఇండైరెక్టుగా ఒప్పుకుంటోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా గెలవాలని తాపత్రయపడుతున్నారని.అందుకే టీడీపీతో దోస్తీ కోసం ఎదురుచూస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.