దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నట్టుగానే కనిపిస్తోంది.ముఖ్యంగా చెప్పుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి కాంగ్రెస్ పార్టీ సంచలనమే సృష్టించింది.
తెలంగాణ ఆంధ్రా ను విడదీయడం ద్వారా ఏపీ లో పార్టీ కొంచెం ఇబ్బందిపడినా తెలంగాణాలో తప్పకుండా అధికారంలోకి వస్తామని భావించింది.అయితే అనూహ్యంగా అక్కడ టీఆర్ఎస్ హవా బాగా పెరిగి కాంగ్రెస్ నేతలంతా ఆ పార్టీలోకి క్యూ కట్టారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూడా కొన్ని సీట్లు దక్కించుకోవడంతో ఆ పార్టీలోకి కాంగ్రెస్ ముఖ్య నాయకులు క్యూ కట్టారు.ఇప్పుడు అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటుండగా ఏపీలో మాత్రం ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితిని ఎదుర్కుంటోంది.2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేకుండా పోయింది.రాష్ట్ర విభజన కారణంతో కాంగ్రెస్ ఓటమి పాలయిందని అంతా అనుకున్నారు.
కానీ ఆ తరువాత కూడా అదే పరిస్థితి తలెత్తింది.
2019 ఎన్నికలలో పదుల సంఖ్యలో అయినా సీట్లు దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేసింది.అయితే అవేవి వర్కవుట్ అవ్వలేదు.కాంగ్రెస్ పుంజుకుంటుందని భావిస్తూ వచ్చిన వారికి ఇప్పుడు పూర్తిగా ఆశలు పోయాయి.
ఏపీలో 174 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది కాంగ్రెస్.అయితే రెండు చోట్ల మాత్రమే ఆ పార్టీకి డిపాజిట్లు దక్కించుకుంది.
అదీ కూడా పీసీసీ ఛీఫ్ గా రఘువీరారెడ్డి పోటీ చేసిన కల్యాణదుర్గం, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పోటీ చేసిన శింగనమలలో మాత్రమే.అయితే పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి రాజీనామా చేశారు.
దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను భుజానికి ఎత్తుకుని నడిపించేవారు కరువయ్యారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా అనేక వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.
రాజధాని, ఇసుక వివాదం, ప్రభుత్వ వైఫల్యాల మీద టీడీపీ, జనసేన పోటా పోటీగా మాటల యుద్ధం చేస్తున్నాయి.అయినా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నించడంలేదు.
ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ సీనియర్లు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపించడంలేదు.కాంగ్రెస్ సీనియర్ నాయకులు పళ్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, శైలజానాధ్, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, చింతామోహన్ వంటి నేతలు ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలను పట్టించుకునే తీరిక లేనట్టుగా ఉన్నారు.
అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా ఎక్కడా పార్టీ కి ఊపు తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడంలేదు.ఇక హైకమాండ్ కూడా ఏపీ విషయంలో లైట్ తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది.
.