ఎన్నికల ఫలితాల ప్రకటనకు కౌండౌన్ స్టార్ట్ అయిపొయింది.ఇంకా రెండు వారాల్లో ఏపీలో అధికారం ఎవరికి దక్కబోతోంది అనే విషయం తేలిపోనుంది.
ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.వారికే కాదు ఓటర్లకు కూడా టెన్షన్ పట్టుకుంది.
తాము ఓటు వేసిన అభ్యర్థి, పార్టీ గెలుస్తుందా లేదా అనే ఉత్కంఠ వారికి కూడా ఉంది.ఇక ఇప్పుడు అధికారంలోకి రాబోయే పార్టీ ఏది ? ఓడిపోయే పార్టీ ఏది ? గెలిస్తే ఆ పార్టీ గెలవడానికి గల కారణాలు ఏంటి ? ఓడితే దానికి కారణాలు ఏంటి అనే చర్చలు కూడా అప్పుడే మొదలయిపోయాయి.పట్నం, పల్లె అనే తేడా లెక్కడా అంతా ఇప్పుడు పొలిటికల్ ఇష్యుస్ మీదే చర్చలు పెట్టుకుంటున్నారు.
ఏపీలో టీడీపీ అధికారం దక్కించుకుంటే అందుకు దోహదం చేసిన అంశాలు ఏంటి ? అనే విశ్లేషణ ఒకసారి పరిశీలిస్తే , ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది.పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలతో పాటు రైతులకు తుది విడత రుణమాఫీ వంటి పథకాలు టీడీపీకి ఓట్లు కురిపించే అవకాశం కనిపిస్తోంది.వీటితో పాటు పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం కష్టపడినా తీరు, కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా సహాకారం అందించకపోయినా ఏపీలో అనేక సంక్షేమ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడం, అలాగే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల విషయంలో మోసం చేసిన కేంద్రంతో సీఎం చంద్రబాబు చేసిన అలుపెరుగని పోరాటం తదితర అంశాలు టీడీపీ కి బాగా కలిసొచ్చే ఛాన్స్ ఉంది.
ఓడితే మాత్రం టీడీపీ ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి, బంధుప్రీతి, ఇసుక మాఫియా, జన్మభూమి కమిటీల ఏర్పాటు కారణంగా తీవ్రమైన ప్రజావ్యతిరేకత రావడం, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు పూర్తిగా చేరకపోవడం, తదితర కారణాలన్నీ టీడీపీకి మైన్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.ఇక వైసీపీ విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో వైసీపీ మానిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల హామీతో పాటు జగన్ మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయడం, వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ జగన్ కి కూడా ఉండడం వైసీపీకి బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది.అదీకాకుండా ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం కదా ! ఒకసారి జగన్ కి అవకాశం ఇస్తే ఏమి చేస్తాడో చూద్దాం అనే భావన కూడా ప్రజల్లో ఎక్కువ కనిపించడం ఆ పార్టీకి ప్లస్ గా మారే అవకాశం ఉంది.ప్రస్తుతం వివిధ విశ్లేషణల ప్రకారం చూస్తే ఏపీలో ‘ఫ్యాను’ గాలి గట్టిగా వేసినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.