ఇప్పటి వరకు అగ్రరాజ్యాల కనుసన్నల్లో నడిచిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక నుంచి భారతదేశం చేతుల్లోకి రానుంది.డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వాహక మండలి ఛైర్మన్గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ నియమితులయ్యారు.
ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు.ప్రస్తుతం జపాన్కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని….
డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వాహక మండలి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.ఆయన పదవి కాలంలో త్వరలో ముగియనుంది.
దీంతో కొత్త ఛైర్మన్గా డబ్ల్యూహెచ్ఓలో సభ్యత్వం ఉన్న 194 దేశాలు హర్షవర్థన్ను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి.ఈ పదవికి హర్షవర్థన్ను నామినేట్ చేస్తూ భారత ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ సభ్య దేశాల ప్రతినిధులు సంతకం చేశారు.
దీంతో ఎలాంటి పోటీ లేకుండా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డబ్ల్యూహెచ్ఓ అధికారులు వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు డైరెక్టర్లుగా 34 దేశాల ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు.
రొటేషన్ పద్ధతిలో ప్రతి మూడేళ్లకోసారి ఛైర్మన్ పదవిని భర్తీ చేస్తారు.డబ్ల్యూహెచ్ఓ తీసుకుబోయే నిర్ణయాలన్నింటినీ సమీక్షించే అధికారం ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఉంది.
నిబంధనల ప్రకారం ఏడాదికి కనీసం రెండు సార్లు బోర్డు సమావేశం కావాలి.దీనిలో భాగంగా జనవరి, మే నెలల్లో డైరెక్టర్లు సమావేశం అవుతారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ అసెంబ్లీ అమలు చేయబోయే ప్రతిపాదనలు, తీసుకునే నిర్ణయాలన్నీ బోర్డు ఆమోదిస్తేనే అవి కార్యరూపం దాలుస్తాయి.కాగా డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వాహక బోర్డు ఛైర్మన్ పదవికి భారత్ను నామినేట్ చేస్తూ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య గతేడాదే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ అంటే సామాన్యులకు కూడా తెలిసిపోయింది.దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంస్థపై విమర్శలు చేస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.