జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో.
ఇప్పటి నుంచే అన్ని రాజకీయ అంశాలపై ఒక క్లారిటీ తెచ్చుకునే పనిలో ఉన్నారు.ముఖ్యంగా పొత్తుల విషయంలో ఏదో ఒకటి త్వరగా తేల్చుకోవాలని క్షేత్రస్థాయిలో జనాల్లోకి వెళ్లి తమ బలం పెంచుకోవాలని చూస్తున్నారు.
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై జనాల్లో ఆగ్రహం పెరిగిందని, దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని పవన్ అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చడం తనకు ఇష్టం లేదని చెబుతూ పరోక్షంగా పొత్తుల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.
అంతేకాదు గతంలో తాము తెలుగుదేశం పార్టీ కోసం త్యాగం చేసాము కాబట్టి ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని పవన్ పరోక్షంగా కోరుతున్నారు.ఎప్పుడూ మేమె తగ్గుతున్నాము… ఈసారి మీరు తగ్గాలి అంటూ ఆయన హింట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మూడు ఆప్షన్స్ ఇచ్చారు.జనసేన ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, జనసేన బీజేపీ కలిసి వెళ్లడం, జనసేన, బిజెపి, టిడిపి కలిసి వెళ్లడం.
ఈ మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకుంటారు అంటూ చంద్రబాబును పరోక్షంగా పవన్ ప్రశ్నించారు.
అంతేకాదు 2024 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా సీఎం అభ్యర్థిగా తానే ఉంటానని పవన్ క్లారిటీ ఇచ్చేశారు.
దీనిపైన ఇప్పుడు టిడిపి జనసేన మధ్య వార్ కి కారణమవుతోంది.ఒకసారి చంద్రబాబుకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈసారి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేలా టిడిపి సహకరించాలని జనసేన నాయకులు కోరుతున్నారు.
తమతో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏదైనా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సిందేనని జనసేన నాయకులు వాయిస్ వినిపిస్తుండగా, టిడిపి మాత్రం పవన్ కు అంత సీన్ లేదని, మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని చెబుతుండడంతో క్షేత్రస్థాయిలో జనసేన ,టిడిపి క్యాడర్ మధ్య పొత్తు కుదరకుండానే వార్ మొదలైపోయింది.
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ పొత్తుల రాజకీయాన్ని మరింత స్పీడ్ చేశారు.ఈ వ్యవహారాలన్నీ ఏపీ అధికార పార్టీ వైసీపీ జాగ్రత్తగా పరిశీలిస్తోంది.బీజేపీ ,జనసేన కలిసి పోటీ చేయాలని టిడిపి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతోంది.
అందుకే జనసేన ,టిడిపి వార్ ఎంతగా ముదిరితే అంతగా తమకు లాభం అనే లెక్కలో వైసీపీ ఉంది.