పచ్చని కోనసీమ ఒక్కసారిగా కల్లోలంగా మారింది.ఏపీ రాజకీయాల్లో కోనసీమ ప్రాంతంలోని పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
కోనసీమ జిల్లా పేరును డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మార్చడాన్ని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కోనసీమ అనే తమ భౌగోళిక గుర్తింపును కాదని ప్రభుత్వం జిల్లా పేరు మార్చడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాయి.తమ జిల్లాకు ఏ పేరూ వద్దూ.
కోనసీమే ముద్దు అంటూ ఆందోళనకారులు నినాదాలు కూడా చేశారు.
అయితే ఆందోళనలను ముందుగానే పసిగట్టిన పోలీస్ యంత్రాంగం కోనసీమ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది.
దీంతో కోనసీమలోని అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, కాట్రేనికొన, రావులపాలెం మండలాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.ఈ ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.అయినా ఆందోళన కారులు లెక్కచేయకుండా అమలాపురంలో నిరసనలు హింసాత్మకంగా మార్చారు.ఏకంగా ప్రభుత్వ నేతల ఇళ్లకు నిప్పుపెట్టారు.
ఈ హింసాత్మక ఘటనలకు కారణం ప్రతిపక్షాలేనని ప్రభుత్వం.
కాదు ప్రభుత్వమే దీనికి కారణమంటూ ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
అయితే ప్రభుత్వం ముందస్తు పరిణామాలను ఆలోచించకుండా జిల్లా పేరు మార్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా రాజోలు, అమలాపురం వంటి రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాకముందు ఇక్కడ కాపులు, శెట్టిబలిజల వర్గ పోరు ఎక్కువగా ఉండేది.ఎస్సీలు కూడా తమ ఆధిపత్య ప్రదర్శన కోసం అనేక ఉద్యమాలు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ మూడు వర్గాల మధ్య రాజకీయాల్లో వైరం ఇప్పటికీ కొనసాగుతోంది.
కానీ వీటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కోనసీమకు జోడించింది.ఇది సహజంగానే అగ్రవర్ణ రాజకీయ నేతలకు ఆగ్రహం తెప్పించింది.అందుకే కోనసీమ ప్రాంతం రావణకాష్టంలా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రాంతంలో ఆందోళనలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రజలతో చర్చలు జరిపి వారి భావోద్వేగాలను చల్లార్చడం మినహా మార్గం లేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.అయితే ప్రభుత్వం ప్రజా కోణంలో ఆలోచిస్తుందా.
రాజకీయ కోణంలో ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.