మరికొద్ది గంటల్లో ఎవరి జాతకం ఎలా ఉంది ? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ? సీఎం పీఠం ఎవరికి దక్కబోతోంది ? కింగ్ ఎవరు .కింగ్ మేకర్ ఎవరు ? ఇలా సవాలక్ష ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది.ఏప్రియల్ 11 వ తేదీ నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ టెన్షన్ కి రిలీఫ్ వచ్చేస్తుంది.జనాలంతా ఎన్నికల ఫలితాల కోసం అప్పుడే టీవీల ముందు పడిగాపులు కాస్తున్నారు.
ఎవరెన్ని టెన్షన్స్ పడినా చివరకి మాత్రం ఫలితాలు అయితే వచ్చేయబోతున్నాయి.ఇక ఫలితాల ప్రకటన తరువాతే అసలు సిసలు రాజకీయం అంతా స్టార్ట్ అవుతుంది.
మ్యాజిక్ ఫిగర్ కి అటు ఇటుగా ఎన్నికల ఫలితాలు కనుక వెలువడితే జంపింగ్ రాయుళ్ల సందడి పెరిగిపోతుంది.ఇప్పుడు వైసీపీ, టీడీపీ లలో అదే టెన్షన్ పట్టుకుంది.
ఏపీలో టీడీపీ, వైసీపీ ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఎమ్మెల్యేల వలసలు భారీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే 2014 ఫలితాల అనంతరం కూడా ఈ తరహా రాజకీయమే జరిగినప్పటికీ ఈసారి అంతకు మించిన జంపింగ్లు ఉండే అవకాశముందని చెప్పుకొస్తున్నారు.ప్రమాణ స్వీకారం చేసేలోపే ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మారొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగింది.ఆ తరువాత కూడా ఎవరూ వెనక్కి తగ్గకుండా మేము అధికారంలోకి వస్తామంటే మేము అధికారంలోకి వస్తామంటూ హడావుడి చేస్తూనే ఉన్నారు.సర్వేలు ఏమి చెప్పినా మాకు అనవసరం మేము అధికారంలో రావడం మాత్రం ఖాయం అంటూ టీడీపీ ధీమాగా చెప్తూ వస్తోంది.ఇక వైసీపీ అయితే అప్పుడే గెలిచినంత హడావుడి ఎన్నికలు ముగిసిన నాటి నుంచి చేస్తూనే ఉంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం ఓడిన పార్టీ అభ్యర్థులు ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడరని, అలాగే మంచి ఆఫర్ కనుక వస్తే గెలిచిన అభ్యర్థులు పార్టీ మారేందుకు వెనుకాడబోరని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు.