ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.ఇటీవల బాపట్ల జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో అటు జనసేన పార్టీలో.
ఇటు టీడీపీలో గందరగోళం నెలకొంది.వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పొత్తులతో ముందుకు వెళ్తామని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అప్పటినుంచి ఏపీలో పొత్తు రాజకీయాలు ఓ రేంజ్లో నడిచాయి.అయితే పొత్తులపై పవన్ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
2024 ఎన్నికల్లో తమ పొత్తు కేవలం ప్రజలతో ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంతో ఈక్వేషన్లు మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మనసులో మాత్రం జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తే కొన్ని చోట్ల మరింత మెరుగైన ఫలితాలు అందుకోవచ్చని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్తో పొత్తుకు టీడీపీ సిద్ధంగానే ఉన్నా ఒకవేళ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఏ మేరకు జనసేనకు సాయం చేస్తారు అన్న పాయింట్ కూడా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ తన మనసు మార్చుకోవడానికి వైసీపీ నేతల ర్యాగింగ్ కారణమని ప్రచారం జరుగుతోంది.
దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ మంత్రులు, సీనియర్ నేతలు పదేపదే వ్యాఖ్యలు చేస్తుండటంతో జనసేన నేతలు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.అందులోనూ ఒంటరిగా పోటీ చేసినప్పుడే పార్టీ అసలు సత్తా తెలుస్తుందని వైసీపీ నేతలు సవాల్ విసరడంతో పొత్తులపై పవన్ మాట మార్చడానికి కారణమైందన్న టాక్ వినిపిస్తోంది.
ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.బీజేపీ, జనసేన పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
కాబట్టి టీడీపీ, జనసేన వేర్వురుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ఖాయం.అలాంటప్పుడు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న కోణంలోనూ ఆలోచించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఎవరు ఎటు ఉన్నా ఎన్నికల్లో నెగ్గుకు రావడం చాలా ముఖ్యం.కానీ ప్రస్తుతం వైసీపీ బలాన్ని చూస్తే ఈ విషయం అంత సులువు కాదు.కనుక ఎవరికి వారు పంతాలు వీడి పద్ధతిగా కలిసి ప్రయాణిస్తే కాస్త మంచి ఫలితాలే రావొచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.అయితే చంద్రబాబు ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడక పోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని ఓ వర్గం ప్రచారం చేస్తోంది.
ఎన్నికలకు సమయం ఉన్నందున ఇప్పటి నుంచే పొత్తుల గురించి మాట్లాడితే జగన్ అండ్ కోకు అనవసరంగా అస్త్రాలు అందించడమే అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.