అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఎడాపెడా మార్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.తాజాగా విదేశీయులకు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు.
విదేశీ వృత్తినిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పించే హెచ్ 1బీ వీసాపై 22 శాతం, ఎల్ 1 వీసాపై 77 శాతం రుసుమును పెంచేందుకు ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.వీసా రుసుముల పెంపుకు సంబంధించిన తుది ముసాయిదాను యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గత వారం వైట్ హౌస్లోని ఇమ్మిగ్రేషన్ అండ్ రెగ్యులేటరీ ఎఫైర్స్ కార్యాలయానికి సమర్పించింది.
ఈ ముసాయిదాలో ఫీజు యొక్క పరిమితులు అస్పష్టంగా ఉన్నప్పటికీ, వీసా రుసుము ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన తగ్గుదల కారణంగా యూఎస్సీఐఎస్ ప్రస్తుతం నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.వచ్చే జూలై నాటికి ప్రభుత్వం నుంచి వచ్చే 1.2 బిలియన్ డాలర్ల నిధులు సమకూరకపోతే ఈ ఏజెన్సీలో పనిచేసే 18,700 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది.
వీసా ఫీజులను పెంచే ప్రతిపాదనను గతేడాది నవంబర్లో తీసుకొచ్చారు.వీసా వర్గాన్ని బట్టి ఐ-129 కోసం యూఎస్సీఐఎస్ వేరు వేరుగా రుసుములను సిఫారసు చేసింది.దీని ప్రకారం హెచ్ 1 బీ వీసాకు బేసిక్ ఫీజు 22 శాతం పెరిగి 560 డాలర్లకు, ఇంట్రా-కంపెనీ బదిలీల కోసం ఉద్దేశించిన ఎల్ 1 వీసా ఫీజు 77 శాతం పెరిగి 815 డాలర్లకు చేరుకుంటుంది.
దీని తర్వాత కనీసం 50 మందికి పైగా ఉద్యోగులున్న కంపెనీలను ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ లక్ష్యంగా చేసుకునే అవకాశం వుంది.దీని ప్రకారం ఆ సంస్థల ఉద్యోగుల వీసా పొడిగింపు దరఖాస్తు కోసం 4,000 డాలర్ల అదనపు రుసుమును చెల్లించాలని ప్రతిపాదిస్తుంది.
ఇది యూఎస్లో పనిచేస్తున్న ఎన్నో భారతీయ కంపెనీల వీసా ఖర్చులను గణనీయంగా పెంచే అవకాశం వుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా వీసా రుసుముల పెంపు అధికారం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే వుందని.
భారతదేశానికి చెందిన సాఫ్ట్వేర్ లాబీ బాడీ నాస్కామ్ పేర్కొంది.మరో రెండు ఇమ్మిగ్రేషన్ సంస్థలు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్స్ (ఏఐఎల్ఏ), అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ (ఏఐసీ)లు సైతం ప్రభుత్వం తన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి.