అమెరికా ఎన్నికల్లో గెలుపు ఓటములపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలయ్యింది.ట్రంప్ గెలుస్తాడా, లేక బిడెన్ గెలుస్తాడా అనే సందిగ్ధత ప్రతీ ఒక్కరిలో నెలకొంది.
ఈ క్రమంలోనే అధ్యక్ష అభ్యర్ధులు ఇరువురు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వస్తే అమెరికా అల్లకల్లోలంగా మారుతుందని, అమెరికా చైనా చెప్పుచేతల్లోకి వెళ్ళిపోతుందని ట్రంప్ తనదైన శైలిలో ప్రచారం చేపడుతున్నారు.
అంతేకాదు డెమొక్రాట్ల చేతికి పాలన అందిస్తే అమెరికా మరో క్యూబా లా మారుతుందని, వామపక్ష వాదుల దేశంగా అమెరికాని మార్చేస్తారని విమర్శలు చేస్తున్నారు.డెమోక్రాట్లు కూడా బిడెన్ పై ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇదిలాఉంటే
తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెమోక్రాట్లు, నిపుణులు మండిపడుతున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక వేళ తాను ఓడిపోతే అధికారాన్ని బదిలీ చేసే అవకాశాలు లేవని అలా జరగదని విలేఖరుల సమావేశంలో ట్రంప్ ప్రకటించారు.
ఈ ఎన్నికలు ప్రజా ఆమోదయోగ్యంగా జరగకపోతే అధికారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వేరే వారికి ఇవ్వనని స్పష్టం చేశారు.దాంతో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి.
ఈ విషయాన్ని కూడా డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వాడేసుకుంటోంది.దాంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌస్ వివరణ ఇచ్చింది.
అధికారాన్ని బదిలీ చేయనని ట్రంప్ చెప్పలేదని, ట్రంప్ ఉద్దేశ్యం అది కాదని ప్రకటించింది వైట్ హౌస్.పోస్టల్ ఓటింగ్ లో డెమోక్రాట్లు రిగ్గింగు కు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారని, ఈ క్రమంలో గెలుపు తనకి ఎలా వస్తుందని ప్రశ్నించారు తప్ప మరెలాంటి దురుద్దేశ్యం లేదని తెలిపింది.
ప్రజలు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా ట్రంప్ గౌరవిస్తారని, ఓటింగ్ విధానంలో గనుకా అనుమానాలు వస్తే అభ్యంతరం తెలిపే హక్కు అధ్యక్షుడిగా ఆయనకి ఉందని స్పష్టం చేసింది.